సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం గాంధీ భవన్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. తెలంగాణ ఉద్యమకారులు గురువారం మెరుపు నిరసనకు దిగారు. అయితే అప్రమత్తమైన పోలీసులు వాళ్లను లోపలికి చోచ్చుకుని పోకుండా నిలువరించగలిగారు.
బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ ఉద్యమకారులకు అన్యాయం జరిగిందని.. తాము అధికారంలోకి రాగానే తప్పకుండా న్యాయం చేస్తామని ఎన్నికల సమయంలో రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు. అయితే.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండున్నరేళ్లైనా ఇప్పటిదాకా ఆ హామీని నెరవేర్చలేదని చెబుతూ ఉద్యమకారులు ఆందోళన చేపట్టారు.
గాంధీ భవన్ వద్ద గురువారం చిప్పలు చేతబట్టి తెలంగాణ ఉద్యమకారులు భిక్షాటన ద్వారా నిరసన చేపట్టారు. వాళ్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు అక్కడి నుంచి తరలించారు. ఈ క్రమంలో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది.


