జస్టిస్‌ ఎంజీ ప్రియదర్శిని కన్నుమూత | Telangana High Court Justice MG Priyadarsini passes away | Sakshi
Sakshi News home page

జస్టిస్‌ ఎంజీ ప్రియదర్శిని కన్నుమూత

May 5 2025 5:46 AM | Updated on May 5 2025 5:46 AM

Telangana High Court Justice MG Priyadarsini passes away

కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జడ్జి

నేడు జూబ్లీహిల్స్‌ మహాప్రస్థానంలో అంత్యక్రియలు

సాక్షి, హైదరాబాద్‌/చందానగర్‌: తెలంగాణ హైకోర్టు న్యా యమూర్తి మాటూరి గిరిజాప్రియదర్శిని (61) కన్నుమూశా  రు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లో ఆదివారం ఉదయం 10 గంటలకు తుదిశ్వాస విడిచారు. సోమవారం మధ్యాహ్నం జూబ్లీహిల్స్‌ మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె హఠాన్మరణం పట్ల న్యాయవాద వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది. హైకోర్టు న్యాయమూర్తులు, న్యా యవాదులు, సిబ్బంది సంతాపం వ్యక్తం చేశారు. విశాఖకు చెందిన నాగరత్నం – మారుతి అప్పారావు గిరిజాప్రియదర్శిని తల్లిదండ్రులు.

మారుతి అప్పారావు తెలంగాణలో వాణిజ్య పన్నుల శాఖ అధికారిగా పనిచేశారు. నాగరత్నం గృహిణి. గిరిజాప్రియదర్శిని ఇంటర్‌ పూర్తి కాగానే కె.విజయ్‌కుమార్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు నిఖిల్, అఖిల్‌. వివాహం తర్వాత కూడా ఆమె చదువును కొనసాగించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి సోషియాలజీ, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్‌ సైన్స్‌లో పీజీ పూర్తి చేశారు. విశాఖపట్నం ఎన్‌బీఎం న్యాయ కళాశాల నుంచి ఎల్‌ఎల్‌బీ, ఆంధ్ర వర్సిటీ నుంచి ఎల్‌ఎల్‌ఎం పూర్తి చేశారు. ఎల్‌ఎల్‌ఎంలో అత్యధిక మార్కులతో తొలి స్థానం సాధించారు. 1995లో ఏపీ బార్‌ కౌన్సిల్‌లో న్యాయవాదిగా ఎన్‌రోల్‌ అయ్యారు. పి.ఉమాబాల వద్ద జూనియర్‌గా ప్రాక్టీస్‌ ప్రారంభించారు. సివిల్, క్రిమినల్, లేబర్, కుటుంబ సంబంధిత కేసుల్లో వాదనలు వినిపించారు. 

పేదలకు ఉచిత న్యాయం కోసం విశేష కృషి
ఎంజీ ప్రియదర్శిని 2008లో జిల్లా న్యాయమూర్తిగా ఎంపికయ్యారు. ఒంగోలు, ఆదిలాబాద్, కరీంనగర్, ప్రకాశంలో విధులు నిర్వర్తించారు. జిల్లాల్లో పనిచేసినప్పుడు పేదలకు ఉచిత న్యాయ సాయం అందించే జిల్లా న్యాయసేవాధికార సంస్థను తొలి స్థానంలో నిలపడంలో విశేష కృషి చేశారు. ఉచిత న్యాయం ప్రజల హక్కు అని ప్రచారం కల్పించారు. ఆమె సేవలను జాతీయ న్యాయ సేవాధికార సంస్థ (నల్సా) ప్రశంసించింది. 2022లో తెలంగాణ న్యాయమూర్తిగా పదో న్నతి పొందారు. అనారోగ్యంతో బాధపడుతున్నా ఏడాది కాలంగా ఆన్‌లైన్‌ ద్వారా కేసుల విచారణ కొనసాగిస్తూనే ఉన్నారు. న్యాయమూర్తిగా వేల తీర్పులు ఇచ్చారు.

ఏసీజే నివాళులు
జస్టిస్‌ గిరిజా ప్రియదర్శి మృతికి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సుజోయ్‌పాల్‌ సంతాపం ప్రకటించారు. ఆమె భౌతికకాయానికి నివాళులు అరి్పంచారు. ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, తెలంగాణ జడ్జెస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కె.ప్రభాకర్‌రావు, ప్రధాన కార్యదర్శి కె.మురళీమోహన్‌ ప్రగాఢ సంతాపం తెలియజేశారు. న్యాయమూర్తిగా ఆమె చేసిన కృషిని కొనియాడారు.

Advertisement
 
Advertisement
Advertisement