సాక్షి, హైదరాబాద్: హైడ్రాకు బిగ్ ఝలక్ తగిలింది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలంలో చేపట్టిన భారీ ఆపరేషన్ను ఆపేయాలంటూ తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో కూల్చివేతలను నిలిపి వేసి హైడ్రా అధికారులు వెనుదిరిగిన దృశ్యాలు కనిపిస్తున్నాయి.
అమీన్పూర్ మండలంలోని ఐలాపూర్లో శనివారం ఉదయం నుంచి భారీ ఎత్తున ఆపరేషన్ను చేపట్టింది హైడ్రా. హైకోర్టుకు చెందిన ఓ లాయర్కు చెందిన ఫామ్హౌజ్తో పాటు ఓ ఆరంతస్తుల భవనం, పలు నిర్మాణాలను కూల్చేసింది కూడా. అయితే కూల్చివేతల నేపథ్యంలో బాధితులు కొందరు అత్యవసరంగా హైకోర్టును ఆశ్రయించగా.. స్టే ఆదేశాలు వచ్చినట్లు సమాచారం అందుతోంది.
ఐలాపూర్ పరిధిలో 1,260 ఎకరాల నిజాం, ప్రభుత్వ భూములు ఉన్నాయని.. వీటిలో చాలా వరకు అక్రమ కట్టడాలు వెలిశాయని, మరికొంత భూమిని కబ్జా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెబుతూ కూల్చివేతలకు దిగింది హైడ్రా. ఈ క్రమంలో ఘర్షణలు తలెత్తకుండా సుమారు 2,000 మంది హైడ్రా, రెవెన్యూ, పోలీసు సిబ్బందితో కూల్చివేతలను మొదలుపెట్టింది కూడా.
జస్ట్ బ్రేక్ ఇచ్చాం
అయితే హైడ్రా మాత్రం కూల్చివేతలు కొనసాగుతాయని అంటోంది. మేం పేదల ఇళ్ల జోలికి పోవడం లేదు. అక్రమ నిర్మాణాల్లో ఉంటున్నవాళ్లకు 2 గంటల సమయం ఇచ్చాం. ఆ తర్వాత కూల్చివేతలు కొనసాగుతాయి అని అంటోంది. అమీన్పూర్ పరిణామాలపై మరికాసేపట్లో స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.

సేవ్ ఐలాపూర్ ఫ్లకార్డులతో..
ఐలాపూర్లో హైడ్రా కూల్చివేతలకు అనూహ్యంగా స్థానికుల్లో కొందరి నుంచి మద్దతు లభించింది. ఈ ఉదయం నుంచి పలువురు సేవ్ ఐలాపూర్ అంటూ హైడ్రా ఆపరేషన్కు మద్దతుగా ఫ్లకార్డులతో ర్యాలీలు నిర్వహించడం గమనార్హం.


