సాక్షి, హైదరాబాద్: కాంబోడియాలో నిర్వహిస్తున్న సైబర్ నేరాల నెట్వర్క్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సైబర్ నేరగాళ్ల కాల్ సెంటర్లకు సిమ్ కార్డులు సప్లయ్ చేస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో మంగళవారం అరెస్ట్ చేసింది. కాంబోడియాకు తరలిస్తున్న 198 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకుంది. ఈ నెట్వర్క్ వివరాలను టీజీసీఎస్బీ డైరెక్టర్ శిఖాగోయల్ బుధవారం వెల్లడించారు. చాంద్రాయణగుట్టకు చెందిన సయ్యద్ అష్రఫ్ అలీకి మూడేళ్ల క్రితం దుబాయ్లో రిజ్వాన్తో పరిచయం ఏర్పడింది.
తాను పనిచేస్తున్న కాల్ సెంటర్కు ఇండియాకు చెందిన సిమ్ కార్డులు సరఫరా చేస్తే పెద్దమొత్తంలో డబ్బు ఇస్తానని రిజ్వాన్ ప్రలోభపెట్టాడు. దీంతో అష్రఫ్ హైదరాబాద్ తలాబ్ కట్టకు చెందిన సయ్యద్ సోహైల్, అతీక్ అహ్మద్తో పాటు హనుమకొండకు చెందిన నూనె అశోక్ (29)ల వద్ద 600 సిమ్ కార్డులు సేకరించాడు. ఇలా సేకరించిన సిమ్ కార్డులను మయన్మార్లోని సైబర్ నేరగాళ్లు ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్, డిజిటల్ అరెస్ట్లు సహా సైబర్ నేరాలకు వినియోగించేవారు. గుట్టు రట్టవడంతో టీజీసీఎస్బీ అధికారులు అష్రఫ్ సహా రిజ్వాన్, సయ్యద్ సోహైల్, అతీక్ అహ్మద్, హనుమకొండకు చెందిన నూనె అశోక్ను అరెస్ట్ చేశారు.


