
‘గ్లోబల్ డిజిటల్’ లక్ష్యంలో పాలుపంచుకోండి
‘ఏఐ’ ఆర్ అండ్ డీ సెంటర్ను ఏర్పాటు చేయండి
డీప్–టెక్, ఏఐ స్టార్టప్లలో పెట్టుబడులు పెట్టండి
యూఏఈని ఆహ్వనించిన ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణను ‘గ్లోబల్ డిజిటల్, ఇన్నోవేషన్ హబ్’గా మార్చా లని కాంగ్రెస్ ప్రభుత్వం సంకల్పించిందని, ఈ లక్ష్య సాధనలో భాగస్వామి కావాలని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ఆహ్వనించారు. యూఏఈ పర్యటనలో భాగంగా ఆ దేశ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఏఐ, డిజిటల్ ఎకానమీ అండ్ రిమోట్ వర్క్ అప్లికేషన్స్ ఒమర్ బిన్ సుల్తాన్ అల్ ఒలా మాతో గురువారం శ్రీధర్బాబు భేటీ అయ్యారు.
తెలంగాణను ‘ఏఐ కేపిటల్ ఆఫ్ ది గ్లోబ్’గా తీర్చి దిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్న ఏఐ సిటీ, ఏఐ యూనివర్సిటీ, ఏఐ ఇన్నోవేషన్ హబ్ తదితర ప్రాజెక్టుల గురించి శ్రీధర్ బాబు వివరించారు. భారత్లోనే తొలిసారిగా అందుబాటులోకి తెచ్చిన ఏఐ ఆధారిత ‘తెలంగాణ డేటా ఎక్సే్చంజ్’వల్ల ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, ప్రభుత్వ పాలన తదితర రంగాల్లో కలుగుతున్న ప్రయోజనాల గురించి తెలిపారు. హైదరాబాద్లో ఏఐ ఆర్ అండ్ డీ సెంటర్ను ప్రారంభించాలని కోరారు.
యూఏఈ డిజిటల్ ఆర్థిక సంస్థలకు భార త్లో ప్రవేశ కేంద్రంగా హైదరాబాద్ అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందని తెలిపారు.జీసీసీల ఏర్పాటుకు తెలంగాణఅన్ని రకాలుగా అనుకూలమని, ఇక్కడ యూఏ ఐ కంపెనీలు నానో– జీసీసీలు, డిజిటల్ హబ్స్ ప్రారంభించేలా చొరవ చూపాలని విన్నవించారు.
డీప్–టెక్, ఏఐ స్టార్టప్లలో పెట్టుబడులు పెట్టడానికి యూఏఈ సావరిన్ ఫండ్స్, వెంచర్ క్యాపిటల్ సంస్థలకు మంచి అవకాశాలు ఉన్నాయని శ్రీధర్బాబు తెలిపారు. ‘ఏఐ, స్టార్టప్ సమ్మిట్’ను యూఏఈతో కలిసి నిర్వహించేందుకు తెలంగాణ ఆసక్తిగా ఉందని, ఇందుకు సహకరించాలని కోరారు. గేమింగ్లో‘తెలంగాణ–యూఏఈ ఫ్యూచర్ స్కిల్స్ అకాడమీ’ఏర్పాటు చేసేందుకు ముందుకు రావాలని ఆహ్వనించారు.
తెలంగాణతో కలిసి పనిచేసేందుకు సిద్ధం: అల్ ఒలామా
తెలంగాణను ‘గ్లోబల్ డిజిటల్, ఇన్నోవేషన్’హబ్గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను యూఏఈ మంత్రి ఓమర్ బిన్ సుల్తాన్ అల్ ఒలామా ప్రశంసించారు. ఏఐ, డిజిటల్ ఎకానమీ, క్లౌడ్ కంప్యూటింగ్, క్వాంటమ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, గేమింగ్ తదితర రంగాల్లో తెలంగాణతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
100 బిలియన్ డాలర్ల అంచనా వ్యయంతో యూఏఈ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ఏఐ ఆధారిత ‘స్టార్ గేట్’ప్రాజెక్టు గురించి మంత్రి శ్రీధర్బాబుకు వివరించారు. ఈ ప్రాజెక్టులో తెలంగాణ కీలక భాగస్వామిగా మారాలని ఆకాంక్షించారు. త్వరలో యూఏఐలో నిర్వహించనున్న ‘ఫిన్ టెక్ స్టార్టప్స్’సమ్మిట్లో తెలంగాణ కంపెనీలను కూడా భాగస్వామ్యం చేస్తామని చెప్పారు.