మేడ్చల్ జిల్లా: మేడిపల్లి పోలీసుస్టేషన్ పరిధిలో ఓ యువకుడు అత్తను కొట్టి చంపాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. చెంగిచెర్ల ఆర్టీసీ కాలనీకి చెందిన కొల్ల అరుణ(39)కు ఇద్దరు కూతుళ్లు సంతానం. చిన్న కుమార్తె కావ్య(19) గతేడాది కరీంనగర్ చందన్పూర్కు చెందిన కర్రు స్నేహిత్(28)ను ప్రేమ వివాహం చేసుకుంది.
గత నెల 29వ తేదీ రాత్రి అరుణకు స్నేహిత్ ఫోన్ చేసి ‘బాసాన్లు తోమే నీ కూతురిని పెళ్లి చేసుకున్నా.. నేను పెద్ద కంపెనీలో ఆఫీసర్ని. నీ కూతురు చిన్న విషయాలకే అలుగుతుంది’ అని మాటలతో వేధించాడు. మరుసటిరోజు మధ్యాహ్నం అరుణ దుకాణానికని బయటకు వెళ్లి వస్తుండగా స్నేహిత్ ఆమెను తన బైక్పై ఎక్కించుకున్నాడు. కొద్దిసేపటికే కావ్యకు ఫోన్ చేసి.. అత్తమ్మ ఫిట్స్తో కింద పడిందని, ఆసుపత్రికి తరలించానని చెప్పాడు.
ఆసుపత్రికి చేరుకున్న కావ్య.. స్నేహిత్ ప్రవర్తనలో తేడా ఉండటంతో వెంటనే చెంగిచెర్ల ఆర్టీసీ కాలనీలోని హనుమాన్ ఆలయ సమీప సీసీ ఫుటేజీలను పరిశీలించింది. స్నేహిత్ అరుణతో గొడవ పడి హెల్మెట్తో బలంగా కొట్టగా రన్నింగ్ బైక్ పైనుంచి ఆమె కిందపడినట్లు గుర్తించింది. తలకు బలమైన గాయం కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అదేరోజు అరుణ మృతి చెందింది. కావ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


