
జడ్చర్ల: మద్యం మత్తులో సభ్య సమాజం తలదించుకునే విధంగా కన్నతల్లినే చెరపట్టే ప్రయత్నం చేశాడో యువకుడు. దీంతో భార్యను కాపాడే ప్రయత్నంలో తండ్రి చేసిన దాడిలో కుమారుడు మృత్యువాత పడ్డాడు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలంలోని డీటీసీ (జిల్లా పోలీసు శిక్షణ కేంద్రం) సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సీఐ కమలాకర్ కథనం ప్రకారం.. పోలేపల్లి గ్రామానికి చెందిన దంపతులు జడ్చర్ల డీటీసీ సమీపంలో నివసిస్తూ.. కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వీరిలో చిన్న కుమారుడు శ్రీధర్కు మినహా అందరికీ పెళ్లిళ్లు అయిపోయాయి. తల్లిదండ్రుల వద్దే ఉంటున్న శ్రీధర్ (28) కొన్ని రోజులుగా తాగుడుకు బానిసగా మారి జులాయిగా తిరుగుతున్నాడు.
జల్సాలకు అలవాటు పడి తల్లిదండ్రులు కూలీ పనులు చేస్తూ సంపాదించిన డబ్బును బలవంతంగా తీసుకుని తాగుడుకు వెచ్చించేవాడు. అనేకసార్లు మద్యం మత్తులో కన్నతల్లి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించేవాడు. కుమారుడి వేధింపులు భరించలేక విషయాన్ని ఆమె భర్తకు చెప్పింది. దీంతో ఆయన కొడుకును పలుసార్లు మందలించి.. ప్రవర్తన మార్చుకోవాలని హెచ్చరించాడు. అయినా శ్రీధర్లో మార్పు రాలేదు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం నుంచి మద్యం సేవించిన కుమారుడు శ్రీధర్ మధ్యరాత్రి సమయంలో తల్లి దగ్గరకు వచ్చి అత్యాచారం చేయబోయాడు.
ఆమె కొడుకు నుంచి తప్పించుకుని ఇంటి బయటకు పరుగెత్తే ప్రయత్నం చేయగా, చేయి పట్టుకుని గదిలోకి లాక్కెళ్లి లైంగిక దాడికి యతి్నంచాడు. దీంతో ఆమె గట్టిగా కేకలు వేయడంతో పక్క గదిలో నిద్రిస్తున్న భర్త మేల్కొని.. భార్యను కాపాడే ప్రయత్నం చేశాడు. దీంతో కొడుకు ఆగ్రహంతో తండ్రిని నెట్టి వేయడంతో అతను కింద పడిపోయాడు. ఈ క్రమంలో తండ్రి పక్కనే ఉన్న కర్రతో కుమారుడి తలపై బాదడంతో ఒక్కసారిగా కిందపడిపోయాడు. తర్వాత చలనం లేకపోవడంతో తమ కుమారుడు మృతి చెందాడని నిర్ధారించుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.