అమీన్‌పూర్ ముగ్గురు పిల్లల మృతి కేసు.. వెలుగులోకి సంచలన నిజాలు | Sensational Details Come To Light In The Ameenpur Case | Sakshi
Sakshi News home page

అమీన్‌పూర్ ముగ్గురు పిల్లల మృతి కేసు.. వెలుగులోకి సంచలన నిజాలు

Apr 2 2025 7:14 PM | Updated on Apr 2 2025 7:48 PM

Sensational Details Come To Light In The Ameenpur Case

సాక్షి, సంగారెడ్డి: అ​మీన్‌పూర్‌ ముగ్గురు పిల్లల మృతి ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ముగ్గురు పిల్లల్ని తల్లే చంపినట్లు పోలీసులు తేల్చారు. జిల్లా ఎస్పీ  పరితోష్ పంకజ్ కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. వివాహితర సంబంధంతో భర్తతో పాటు ముగ్గురు పిల్లలను కూడా చంపాలని హంతకురాలు రజిత ప్లాన్ చేసింది. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నారని ముగ్గురు పిల్లల్ని ఊపిరాడకుండా చేసి కన్నతల్లే చంపేసింది.

ఇటీవలే పదవ తరగతి విద్యార్థుల గెట్ టుగెదర్‌ పార్టీలో స్నేహితుడితో రజితకు పరిచయం ఏర్పడింది. హంతకురాలు రజిత లావణ్య, ప్రియుడు సూరు శివ కుమార్‌ను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు.

రంగారెడ్డి జిల్లా మెడకపల్లికి చెందిన చెన్నయ్య భార్యాపిల్లలతో సహా రాఘవేంద్ర కాలనీకి వచ్చి స్థానికంగా వాటర్‌ ట్యాంకర్‌ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. మార్చి 28వ తేదీ ఉదయం విధులు ముగించుకుని ఇంటికి వచ్చి చూసేసరికి.. ముగ్గురు పిల్లలు నోటి నుంచి నురగలు కక్కుతూ పడి కనిపించారు. పిల్లలు అచేతనంగా పడి ఉండగా.. భార్య రజిత కడుపు నొప్పితో విలవిలలాడుతూ కనిపించింది. దీంతో ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఫుడ్‌ పాయిజన్‌తో ముగ్గురు పిల్లలు నిద్రలోనే కన్నుమూసినట్లు వైద్యులు నిర్ధారించారు.

పిల్లలకు పెరుగన్నంలో విషం కలిపి.. ఆమె కూడా తిని ఆత్మహత్యాయత్నం చేసిందని తొలుత అంతా భావించారు. అయితే కుటుంబ కలహాల నేపథ్యంతో భర్త చెన్నయ్య పాత్రపై పోలీసులకు అనుమానాలు వ్యక్తం అయ్యాయి. పైగా భార్యాభర్తల మధ్య గతకొన్నేళ్లుగా తరచూ గొడవలు జరుగుతుండడంతో.. రజిత తల్లితో పాటు స్థానికులు ఈ విషయాన్ని నిర్ధారించడంతో ఆ కోణంలోనూ పోలీసులు దృష్టిసారించారు.

కానీ విచారణలో చెన్నయ్య పాత్ర ఏం లేదని తేలడంతో పోలీసులు వదిలేశారు. ఆపై ఆస్పత్రిలో కోలుకుంటున్న రజితను పోలీసులు విచారించారు. ఆమె కదలికలు అనుమానంగా తోచడంతో లోతైన దర్యాప్తు చేశారు. ఈ క్రమంలో విస్తుపోయే విషయం ఒకటి వెలుగు చూసింది. అదే వివాహేతర సంబంధం. రజిత పదో తరగతి క్లాస్‌మేట్స్‌ ఈ మధ్య గెట్‌ టు గెదర్‌ చేసుకున్నారు. ఆ టైంలో రజిత స్కూల్‌ డేస్‌లో చనువుగా ఉండే ఓ వ్యక్తి మళ్లీ టచ్‌లోకి వచ్చాడు.

అలా తన పాత క్లాస్‌మేట్‌తో రజిత చాటింగ్‌, ఫోన్లు మాట్లాడడం చేసింది. ఇది క్రమంగా వివాహేతర సంబంధానికి దారి తీసింది. భర్త, పిల్లలను అడ్డు తొలగించుకుంటే ప్రియుడితో హాయిగా జీవించవచ్చని అనుకుంది. మార్చి 27వ రాత్రి విషం కలిపిన భోజనం భర్త, పిల్లలకు పెట్టాలనుకుంది. అయితే భర్త మాత్రం పప్పన్నం మాత్రమే తిని పనికి వెళ్లిపోగా.. పిల్లలు ఆఖర్లో విషం ‍కలిపిన పెరుగన్నం పిల్లలు తిన్నారు. అలా ముగ్గురు పిల్లలు సాయి క్రిష్ణ (12), మధు ప్రియ(10), గౌతమ్ (8) నిద్రలోనే కన్నుమూశారు.

 

 

 

Advertisement
 
Advertisement
Advertisement