పెళ్లి చేసుకుంటానని నమ్మించి రూ.30 లక్షలు కాజేశాడు
శారీరకంగా కూడా వాడుకుని ఇప్పుడు చంపేస్తానంటున్నాడు
కేసు వాపసు తీసుకోవాలంటూ టీడీపీ నేతలు బెదిరిస్తున్నారు
ప్రభుత్వానికి బాధితురాలు వినతి
హైదరాబాద్: పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనను లోబరుచుకుని తన వద్ద రూ.30 లక్షలకు పైగా నగదును వాడుకుని మోసంచేసిన విజయనగరం పట్టణానికి చెందిన బొబ్బిలి సాయికిరణ్ను తక్షణమే అరెస్టుచేసి శిక్షించాలని బాధితురాలు ప్రభుత్వానికి విజ్ఞప్తిచేసింది. హైదరాబాద్ ప్రెస్క్లబ్లో శుక్రవా రం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రెండేళ్ల క్రితం తాను ఉద్యోగం నిమిత్తం చెన్నై వెళ్లగా అక్కడ సాయికిరణ్ పరిచయమయ్యాడని చెప్పింది. తనకు పెళ్లయి ఒక కూతురు ఉందని, భర్తతో వేరుగా ఉంటున్నానని చెప్పినా తనతో సన్నిహితంగా ఉంటూ పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా తనను లోబరుచుకున్నాడని ఆరోపించింది.
రెండేళ్లు మణికొండలో లివింగ్ రిలేషన్షిప్లో ఉండి తన నుంచి రూ.30 లక్షలకు పైగా తీసుకున్నాడని బాధితురాలు తెలిపింది. ఆరు నెలల క్రితం మరో మహిళ పరిచయం కావడంతో తనను నిర్లక్ష్యం చేస్తూ వచ్చాడని, దీంతో తాను ప్రశ్నించగా తనపై దాడులు చేస్తూ చంపేస్తానని బెదిరించాడని ఆమె వాపోయింది. ఈ విషయమై తాను నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపింది.
అనంతరం.. విజయనగరం వెళ్లి సాయి కుటుంబ సభ్యులతో విష యం చెప్పేందుకు ప్రయత్నించగా అక్కడ సాయి తండ్రి బొబ్బిలి ముత్యాలనాయుడు టీడీపీ ఎంపీపీకి ప్రధాన అనుచరుడని తెలిసిందని, అక్కడి టీడీపీ కార్యకర్తలు తానున్న హోటల్కు వచ్చి సాయికిరణ్పై పెట్టిన కేసును వెనక్కి తీసుకోవాలని బెదిరించారని బాధి తురాలి వాపోయింది. నార్సింగ్ సీఐ హరికిషన్ నిందితుడికి వత్తాసు పలుకుతూ తనను అవమానించారని ఆమె ఆవేదన వ్యక్తంచేసింది.


