హైదరాబాద్: నగర వాసులకు భానుడి భగభగల నుంచి కాస్త ఉపశమనం కల్గింది. ఈరోజు(సోమవారం, మే 25వ తేదీ) హైదరాబాద్లో పలుచోట్ల మోస్తరు వర్షం పడింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కోఠి, ఎల్బీనగర్, వనస్థలిపురం, చింతల్, బాలానగర్, పెద్ద అంబర్పేట్, అబ్దుల్లాపూర్మెంట్ తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. కొన్ని చోట్ల మాదిరిగా వర్షం పడగా, అక్కడక్కడా భారీగానే వర్షం పడింది. ప్రధానంగా కోఠిలో భారీ వర్షం పడింది.
దీంతో హైదరాబాద్ వాసులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అయితే రోహిణి కార్తె ప్రారంభం కూడా ఈరోజే కావడంతో రేపట్నుంచి ఎండలు ఎలా ఉంటాయో అనే ఆందోళన కూడా జనాల్లో ఉంది. రోహిణి కార్తె ప్రారంభంలో సాధారణంగా చినుకులు పడటం జరుగుతూ ఉంటుంది. ఆపై భానుడు మరింత సెగలు కక్కుతాడు. ఈ వర్షం అందుకే సంకేతమైతే నగరవాసులకు మరింత హీట్వేవ్ను చూడాల్సి ఉంటుంది.


