
ఉన్నతస్థాయి సమీక్షలో సీఎం రేవంత్రెడ్డి ఆదేశం
నిర్వహణలో లోటుపాట్లు ఉండొద్దని స్పష్టీకరణ
అదనపు డీజీ ర్యాంకు అధికారి ఆధ్వర్యంలో భద్రతా ఏర్పాట్లు
పహల్గాం ఉగ్ర దాడి నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తం
2017లో ఇవాంకా ట్రంప్ హైదరాబాద్ పర్యటనలో విధులు చేపట్టిన వారి సేవలూ వినియోగం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వేదికగా మే 10 నుంచి జరగనున్న ప్రపంచ సుందరి (మిస్ వరల్డ్–2025) అందాల పోటీలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని.. లోటుపాట్లులేకుండా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఆయన ప్రపంచ సుందరి పోటీలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. పోటీల్లో పాల్గొనేందుకు విదేశాల నుంచి వచ్చే సుందరీమణులు, అంతర్జాతీయ మీడియా ప్రతినిధులకు ఇబ్బందిలేని రీతిలో ఏర్పాట్లు ఉండాలని సీఎం ఆదేశించారు.
విమానాశ్రయం, పోటీలు జరిగే వేదికలు, ప్రతినిధులు బస చేసే హోటళ్ల వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయాలన్నారు. తెలంగాణలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలు, చారిత్రక కట్టడాలను వారు సందర్శించేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. కార్యక్రమాల పర్యవేక్షణకు విభాగాలవారీగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. వచ్చే నెల 4న మరోసారి సమీక్షిస్తానని.. ఆలోగా పనులన్నీ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి, స్పెషల్ సీఎస్ జయేశ్ రంజన్, డీజీపీ జితేందర్తోపాటు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనర్లు, సీఎం ముఖ్యకార్యదర్శి శేషాద్రి, మరికొందరు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
మూడంచెల భద్రతా ఏర్పాట్లు!
మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొననున్న మొత్తం 120 దేశాల ప్రతినిధులు మే 6, 7 తేదీల్లో హైదరాబాద్కు చేరుకోనున్నారు. వారు ఎయిర్పోర్టులో దిగినప్పటి నుంచి బస చేసే హోటళ్లు, పోటీల వేదిక ప్రాంతం వరకు ప్రభుత్వం మూడంచెల భద్రత కల్పించనున్నట్లు తెలిసింది. మొత్తం భద్రతా ఏర్పాట్ల పర్యవేక్షణను అదనపు డీజీ ర్యాంకులో ఉన్న ఓ సీనియర్ ఐపీఎస్ అధికారికి అప్పగించారు. ఆయన నేతృత్వంలో ఇప్పటికే భద్రతా ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. పహల్గాంలో ఉగ్ర దాడి నేపథ్యంలో విదేశీ అతిథుల భద్రత విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
గతంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ 2017లో హైదరాబాద్ పర్యటన సందర్భంగా భద్రతా విధులు నిర్వహించిన, అంతర్జాతీయ సదస్సులకు భద్రతా విధులు చేపట్టిన అనుభవంగల అధికారులు, సిబ్బందిని మిస్ వరల్డ్–2025 భద్రతా ఏర్పాట్లలో భాగస్వాములను చేస్తున్నట్లు సమాచారం. కాగా, మే 31న జరిగే ఫైనల్స్లో విజేతలుగా నిలిచిన వారు రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2న గవర్నర్ జిష్ణుదేవ్వర్మ, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో ప్రత్యేకంగా భేటీ కానున్నారు.