ఎంపీ ఇల్లని తెలియకుండానే చోరీకొచ్చాడు.. | Police Arrested Thief Who Committed Theft At MP DK Aruna House, More Details Inside | Sakshi
Sakshi News home page

ఎంపీ ఇల్లని తెలియకుండానే చోరీకొచ్చాడు..

Mar 19 2025 7:36 AM | Updated on Mar 19 2025 1:05 PM

Police Arrested Thief Who Committed Theft At MP DK Aruna House

చోరీ కోసమే డీకే అరుణ ఇంటికి వెళ్లిన ఘరానా దొంగ

ఉత్తరాఖండ్‌కు చెందిన మహ్మద్‌ అక్రమ్‌గా గుర్తింపు

నిందితుడిపై ఇప్పటికే ఢిల్లీ వ్యాప్తంగా 35 కేసులు

అక్కడి పోలీసుల నిఘా తప్పించుకోవడానికే హైదరాబాద్‌కు   

 సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ ఎంపీ డీకే అరుణ ఇంట్లోకి ప్రవేశించిన అగంతకుడు ఉత్తరాఖండ్‌కు చెందిన ఘరానా దొంగ మహ్మద్‌ అక్రమ్‌గా తేలింది. 2004 నుంచి ఢిల్లీలోని ఖరీదైన ప్రాంతాలను టార్గెట్‌ చేస్తున్న ఇతడు తొలిసారిగా హైదరాబాద్‌కు వచ్చాడు. అది ఎంపీ ఇల్లు అని తెలియకుండానే లోపలికి ప్రవేశించాడు. కేవలం నగదు మాత్రమే తస్కరించే నైజం ఉన్న అక్రమ్‌ అది దొరక్కపోవడంతో ఫ్రూట్‌ బాక్సులు తీసుకుని ఉడాయించాడు. ఈ ఘరానా చోరుడిని పాతబస్తీలోని తలాబ్‌కట్టలో ఉన్న అతడి అద్దె ఇంటి సమీపంలో పట్టుకున్నట్లు పశి్చమ మండల డీసీపీ విజయ్‌కుమార్‌ మంగళవారం వెల్లడించారు. వెస్ట్‌జోన్, సౌత్‌ జోన్‌ టాస్‌్కఫోర్స్‌ పోలీసులు చేపట్టిన సంయుక్త ఆపరేషన్‌లో నిందితుడు పట్టుబడినట్లు పేర్కొన్నారు.  

విలాసవంతమైన జీవితం... 
ఉత్తరాఖండ్‌లోని మొహల్లా ప్రాంతానికి చెందిన అక్రమ్‌ గతంలో తాపీ మేస్త్రీగా, ప్రస్తుతం టైల్స్‌ ఫిట్టింగ్‌ పనిచేస్తున్నాడు. జల్సాలు, అత్యంత విలాసవంతమైన జీవితానికి అలవాటుపడిన అక్రమ్‌ అందుకు అవసరమైన డబ్బు కోసం 2004 నుంచి నేరాలు చేయడం మొదలెట్టాడు. తనపై ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు మొహల్లా నుంచి సాధారణ వ్యక్తిగా బయలుదేరి ఢిల్లీ వెళ్లేవాడు. అక్కడ ఖరీదైన బ్రాండెడ్‌ దుస్తులు ధరించి లాడ్జిల్లో బస చేసేవాడు. ఆ అవతారంలోనే వెళ్లి సంపన్నులు ఉండే ప్రాంతాలను ఎంచుకుంటాడు. తొలిరోజు రెక్కీ చేసి, రెండో రోజు పంజా విసురుతాడు. ఇలా దేశ రాజధానిలో 35 ఇళ్లల్లో చోరీలు చేసి పలుమార్లు పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లాడు. 2014 నుంచి తన మకాంను ఢిల్లీకి మార్చాడు. 

నో గోల్డ్‌... ఓన్లీ క్యాష్‌.. 
ఈ ఘరానా దొంగ గతంలో అనుచరుడిని ఏర్పాటు చేసుకుని చోరీలు చేసేవాడు. ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత బంగారం, వెండితో పాటు నగదు కూడా ఎత్తుకుపోయేవాడు. 2019లో సౌత్‌–ఈస్ట్‌ ఢిల్లీ పోలీసులు ఇతడితో పాటు అనుచరుడు ఖాలిద్‌ మహ్మద్‌ను పట్టుకున్నారు. అప్పట్లో చోరీ బంగారాన్ని విక్రయించడానికి ఖాలిద్‌ ప్రయత్నించడమే పోలీసులకు ఆధారమైంది. ఆ అనుభవంతో పంథా మార్చుకున్న అక్రమ్‌... అనుచరులకు, నగలకు దూరంగా ఉంటున్నాడు. ఒంటరిగా సంచరిస్తూ, ఖరీదైన ఇళ్లల్లోకి ప్రవేశిస్తూ, నగదు మాత్రమే తస్కరించడం మొదలెట్టాడు. ఢిల్లీలో పోలీసుల నిఘా ఎక్కువ కావడంతో హైదరాబాద్‌కు వచ్చి తలాబ్‌కట్ట ప్రాంతంలో ఇల్లు అద్దెకు తీసుకుని ఉన్నాడు. సంపన్నులు ఉండే ప్రాంతంలో ఇంటిని ఎంపిక చేసుకుని, భారీ మొత్తం కొల్లగొట్టి ఢిల్లీ వెళ్లిపోవాలని పథకం వేశాడు.  

సీసీ కెమెరాల సాయంతో అరెస్ట్‌.. 
పాతబస్తీలో ఆటో ఎక్కే అక్రమ్‌ తాను టైల్స్‌ పనిచేస్తానని, దానికోసం సంపన్నులు ఉండే ప్రాంతాలకు వెళ్లాలని డ్రైవర్‌కు చెప్పేవాడు. అలా శనివారం ఉదయం పెద్దమ్మ గుడి వద్దకు వచి్చన అక్రమ్‌ అక్కడ నుంచి పలు ప్రాంతాల్లో తిరిగాడు. చివరకు డీకే అరుణ ఇంటిని ఎంపిక చేసుకుని.. మరుసటి రోజు ఇంట్లోకి ప్రవేశించాడు. ఇల్లు మొత్తం తిరిగినా ఎక్కడా నగదు కనిపించకపోవడం, నిద్రిస్తున్న పనిమనుషుల్లో కదలికలు గమనించడంతో బయటకు వచ్చేశాడు. ఈ కేసును ఛేదించడానికి వెస్ట్‌జోన్‌ పోలీసులు, సౌత్‌ జోన్‌ టాస్‌్కఫోర్స్‌ అధికారులు రంగంలోకి దిగారు. వివిధ ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్‌ ఆధారంగా తలాబ్‌కట్టలో అక్రమ్‌ను గుర్తించి పట్టుకున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement