సీఎం రేవంత్‌తో పీసీసీ చీఫ్‌ మహేశ్‌ గౌడ్‌ భేటీ | PCC Chief Mahesh Goud meets CM Revanth: Telangana | Sakshi
Sakshi News home page

సీఎం రేవంత్‌తో పీసీసీ చీఫ్‌ మహేశ్‌ గౌడ్‌ భేటీ

Nov 29 2025 1:37 AM | Updated on Nov 29 2025 1:37 AM

PCC Chief Mahesh Goud meets CM Revanth: Telangana

స్థానిక ఎన్నికలు, ప్రజా పాలన ఉత్సవాలపై చర్చ

డిసెంబర్‌ 2న డీసీసీ అధ్యక్షులతో సమావేశం నిర్వహించాలని నిర్ణయం

సాక్షి, హైదరాబాద్‌: టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం దాదాపు గంటసేపు జరిగిన ప్రత్యేక భేటీలో పంచాయతీ ఎన్ని కలు, ప్రజాపాలన వారోత్సవాల గురించి ఇరువురు చర్చించారు. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ జరిగినట్టు తెలిసింది. చట్టబద్ధంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయలేని పరిస్థితుల్లో పార్టీ పరంగా ఆ మేరకు రిజర్వేషన్ల కల్పనపై సాధ్యాసాధ్యాల గురించి వీరు చర్చించినట్టు సమాచారం.

ఈ ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ చోట్ల బీసీలకు అవకాశం వచ్చేలా చూడాలని, సర్పంచ్‌ స్థానాలకు పోటీ పడే ఇతర వర్గాల నేతలకు నచ్చచెప్పాలని ఈ సందర్భంగా పీసీసీ చీఫ్‌ మహేశ్‌గౌడ్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించినట్టు తెలిసింది. అదే విధంగా రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లవుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన వారోత్సవాల్లో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాలుపంచుకునేలా చూడాలని, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా పార్టీ పక్షాన పనిచేయాలని ముఖ్యమంత్రి సూచించారు.

అందులో భాగంగా డిసెంబర్‌ రెండవ తేదీన గాంధీభవన్‌లో డీసీసీ అధ్యక్షులుగా కొత్తగా నియామకమైన నేతలతో సమావేశం నిర్వహించాలని, అదే రోజు టీపీసీసీ కార్యవర్గ సమావేశం కూడా నిర్వహించి దిశా నిర్దేశం చేయాలని సీఎం, పీసీసీ చీఫ్‌లు నిర్ణయించారు. మహేశ్‌కుమార్‌ గౌడ్‌ అధ్యక్ష తన జరగబోయే ఈ సమావేశంలో సీఎం రేవంత్‌ రెడ్డి, పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శులు పాల్గొంటారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement