‘కాళోజీ’ వీసీ నందకుమార్‌ రెడ్డి రాజీనామా | Kaloji University VC Nandakumar Resigns | Sakshi
Sakshi News home page

‘కాళోజీ’ వీసీ నందకుమార్‌ రెడ్డి రాజీనామా

Nov 29 2025 1:31 AM | Updated on Nov 29 2025 1:31 AM

Kaloji University VC Nandakumar Resigns

ఫెయిలైన మెడికల్‌ పీజీ విద్యార్థినికి అదనపు మార్కులు కలపడంపై రచ్చ

విజిలెన్స్‌ ప్రాథమిక నివేదికలో వీసీ ప్రమేయం ఉన్నట్లు నిర్ధారణ

వర్సిటీ వ్యవహారంపై సీఎం రేవంత్‌రెడ్డి సీరియస్‌

సాక్షి, హైదరాబాద్‌: కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వైస్‌ చాన్స్‌లర్‌ డాక్టర్‌ నంద కుమార్‌ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని వర్సిటీ చాన్స్‌లర్‌ అయిన గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మకు పంపించారు. వర్సిటీలో పాలన గాడితప్పడం, ఇష్టారీతిన ఇన్‌చార్జీల నియా మకం, ప్రైవేటు మెడికల్‌ కళాశాలలతో కుమ్మక్కు ఆరోపణలు కొంతకాలంగా విశ్వవిద్యాలయం ప్రతి ష్టను దెబ్బతీశాయి. దీనికి తోడు ఇటీవల వర్సిటీ నిర్వహించిన మెడికల్‌ పీజీ పరీక్షల మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయంటూ ఆరోపణలు రావడం, విజిలెన్స్‌ ప్రాథమిక విచారణలో అది నిజమేనని తేలడంతో ప్రభుత్వం సీరియస్‌ అయింది.

దీనిపై ఇంటా బయటా వెల్లువెత్తిన విమర్శల నేపథ్యంలో శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన ఘటనలను ఆరా తీసిన సీఎం వైద్యారోగ్య శాఖ అధికారుల నుంచి వివరణ కోరారు. ప్రతిష్టాత్మ కమైన వర్సిటీలో అస్తవ్యస్త పరిస్థితులకు కారణ మైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే ఘటనల వెనుక ఎంత పెద్ద వారున్నా, ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఉన్నతస్థాయి సంస్థల్లో పనిచేసే వారు సమర్థవంతంగా, నిష్పక్షపాతంగా పనిచేయాలన్నారు.

సీఎస్‌ను కలిసిన నందకుమార్‌
సీఎం తీవ్రంగా స్పందించిన నేపథ్యంలో వీసీ నందకుమార్‌ రెడ్డి వైద్య శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్‌ చోంగ్తూ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును కలిసి మరోసారి వివరణ ఇచ్చారు. అయితే ఓ ప్రైవేటు కాలేజీలో ఫెయిలైన విద్యార్థినికి అదనంగా మార్కులు కలిపి పాస్‌ చేయాల్సిన అవ సరం ఏమొచ్చిందనే ప్రశ్నకు వీసీ ఇచ్చిన సమాధా నం సంతృప్తికరంగా లేదని భావించినట్లు సమాచా రం. సీఎం కార్యాలయం తెప్పించుకున్న నివేదికలో కూడా వీసీ ప్రమేయాన్ని పేర్కొనడం... ఏ కోణంలో చూసినా తప్పు జరిగిందని స్పష్టమవుతుండడంతో వీసీని రాజీనామా చేయాల్సిందిగా సీఎస్‌ సూ చించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆయన తన రాజీనామాను గవర్నర్‌ కార్యదర్శికి పంపించారు.

రాజీనామా నిజమే: నందకుమార్‌ రెడ్డి
నందకుమార్‌ రెడ్డి శుక్రవారం రాత్రి ‘సాక్షి’తో ఫోన్‌ లో మాట్లాడుతూ... విద్యార్థికి జరిగిన అన్యాయా న్ని మాత్రమే చూశాను తప్ప, తను ప్రైవేటు కళా శాల విద్యార్థినా లేదా ప్రభుత్వ కళాశాల విద్యార్థినా అనేది చూడలేదన్నారు. అయితే ఈ అంశంపై అన వసర రాద్ధాంతం జరగడం, రాజకీయ విమర్శలు చోటు చేసుకోవడం బాధించిందన్నారు. అందుకే ప్రభుత్వం, వర్సిటీ ప్రతిష్టకు భంగం కలగకుండా వీసీ పదవికి రాజీనామా చేసినట్లు చెప్పారు. ఈ అంశంపై పూర్తిస్థాయి విచారణ జరిపితే నిజానిజాలు వెలుగు చూస్తాయన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement