సాక్షి, వరంగల్: తెల్లవారుజామున చలిగాలులు వణికిస్తున్నా.. నిద్ర వస్తున్నా ఆ బాలుడు మాత్రం సైకిల్ తొక్కడం ఆపలేదు. భుజాన పేపర్ల కట్టతో గడపగడపకూ వార్తలు చేరవేశాడు. ఇప్పుడు అగ్నివీర్గా ఎంపికై ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నాడు వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రానికి చెందిన 19 ఏళ్ల ముత్యాల సాయికుమార్.
కల సాకారం చేసుకుని..
నాన్న ముత్యాల రవి 2020 వరకు తాటి చెట్లు ఎక్కాడు. ఆ తర్వాత కాళ్ల నొప్పులతో అప్పుడప్పుడు సుతారి పనికి వెళ్తున్నాడు. అమ్మ రమ కూలి పనులతోపాటు ఓ ప్రైవేట్ పాఠశాలలోని తరగతి గదులను శుభ్రం చేసేది. అయితే, నాన్న గీత వృత్తికి దూరమైన సమయంలోనే ఓ రెండేళ్ల పాటు ‘సాక్షి ’ పేపర్ బాయ్గా పనిచేసి వచ్చిన డబ్బులతో కుటుంబానికి సాయి కుమార్ ఆసరా అయ్యాడు. ఆ తర్వాత సోలార్ పని నేర్చుకొని తన చదువు, సోదరి సాయిప్రియ చదువుకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా చూశాడు. నల్లబెల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి వరకు, వరంగల్ ఎల్బీ కళా శాలలో ఇంటర్మీడియట్లో సీఈసీ చదివాడు.
తమ బంధువు, వరుసకు అన్న అయిన నాగఅనూష్కు నే వీ ఉద్యోగం వచ్చింది. తన మనస్సులో కోరికను నాగ అనూష్కు చెప్పడంతో స్టేషన్ఘన్పూర్లోని అగ్నివీర్ డిఫెన్స్ అకాడమీలో చేర్పించాడు. గతేడాది మార్చి నుంచి మూడు నెలలు కోచింగ్ తీసుకొని జూన్లో పరీక్షలు రాశాడు. పెద్దనాన్న కొడుకు, క్యాబ్ డ్రైవర్ రాజు 2024లో రూ.1500తో కొనిచ్చి న షూతోనే ప్రాక్టీస్ చేసి ఈ వెంట్లలో సత్తా చాటాడు. రాతపరీక్షలో 100 మార్కులకు 50, పరుగు పందెంలో మాత్రం 100కు 100 మార్కులు సాధించి మొత్తం 150 మార్కులతో జనరల్ డ్యూటీ (జీడీ) ఉద్యోగాన్ని సొంతం చేసుకున్నాడు.
కష్టాలే దేశసేవకు ఎంపిక చేశాయి..
తొలినాళ్లలో 8 నిమిషాల్లో ఐదు కిలోమీటర్లు పరుగెత్తించేవారు. ఆ తర్వాత 7.5 నిమిషాల్లో పది కిలోమీటర్లకు పరిమితం చేశారు. మైదానంలో పరుగు తీస్తున్న ప్రతిసారీ అమ్మానాన్న కష్టాలే కళ్ల ముందు మెదిలాయి. నాకు జీవిత పాఠం నేర్పిన కష్టాలే ఈ రోజూ నన్ను దేశ సేవకు ఎంపికయ్యేలా చేశాయి. ‘సాక్షి’ దినపత్రికలో వచ్చిన కరెంట్ అఫైర్స్, వివిధ సబ్జెక్ట్ల లోతైన విశ్లేషణ కూడా ఉద్యోగం రావడానికి దోహదపడ్డాయి.
– ముత్యాల సాయికుమార్


