
హైదరాబాద్, సికింద్రాబాద్, వరంగల్ రీజియన్ల పరిధిలో నియామకానికి త్వరలో నోటిఫికేషన్
రెండు నెలల క్రితం 1,000 మంది డ్రైవర్లు, ఇప్పుడు 800 మంది కండక్టర్ల రిక్రూట్మెంట్
సాక్షి, హైదరాబాద్: రెండు నెలల క్రితం ఔట్సోర్సింగ్ పద్ధతిలో డ్రైవర్లను నియమించుకున్న ఆర్టీసీ, ఇప్పుడు అదే పద్ధతిలో కండక్టర్లను కూడా తీసుకునేందుకు సిద్ధమైంది. దాదాపు 800 మంది కండక్టర్లను తాత్కాలిక పద్ధతిలో ఔట్సోర్సింగ్ ద్వారా భర్తీ చేసుకోవాలని నిర్ణయించింది. హైదరాబాద్, సికింద్రాబాద్, వరంగల్ రీజియన్ల పరిధిలో ప్రస్తుతానికి ఔట్సోర్సింగ్ పద్ధతిలో కండక్టర్లను నియమించుకోనుంది. దీనికి సంబంధించి త్వరలో నోటిఫికేషన్ జారీ చేయనుంది.
పూర్తి స్థాయి నియామకాల్లో ఎడతెగని జాప్యంతో...
ప్రస్తుతం ఆర్టీసీలో 2 వేల మంది కండక్టర్ల అవసరముంది. రెగ్యులర్ కండక్టర్లలో దాదాపు 500 మంది ఆర్టీసీ కార్గో సర్వీసు, ఆర్టీసీ పెట్రోల్ బంకులు, సహా ఇతర పలు అనుబంధ విభాగాల్లో పనిచేస్తున్నారు. గడచిన కొన్ని నెలల్లో 1,500 మంది కండక్టర్లు ఉద్యోగ విరమణ చేయగా భారీ కొరత ఎదురైంది. ప్రస్తుతం సరిపోను కండక్టర్లు విధుల్లో లేకపోవటంతో ఉన్న వారితోనే అదనపు డ్యూటీలు చేయిస్తున్నారు.
ఇది కండక్టర్లకు ఇబ్బందిగా మారింది. అదనపు డ్యూటీకి అదనపు చెల్లింపులు ఉంటున్నా, రోజుల్లో 10 నుంచి 12 గంటల పాటు పనిచేయాల్సి రావటంతో వారు తీవ్రంగా అలసిపోతున్నారు. బలవంతపు అదనపు డ్యూటీలు వద్దని చాలా రోజులుగా గగ్గోలు పెడుతున్నారు. డ్రైవర్లు, కండక్టర్లు, డిపో మేనేజర్లు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు సహా పలు ఇతర పోస్టులు కలిపి దాదాపు 4 వేల పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఇప్పటికే గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఆయా పోస్టులను టీఎస్పీఎస్సీ, వైద్యారోగ్య శాఖ, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుల ఆధ్వర్యంలో భర్తీ చేయాల్సి ఉంది.
కానీ, కొంతకాలం ఆయా బోర్డుల నియామక కేలండర్ పేరుతో, ఆ తర్వాత ఎస్సీ వర్గీకరణ రోస్టర్ ఖరారు పేరుతో జాప్యం జరుగుతూ వస్తోంది. నెలలు గడుస్తున్నా ఆ భర్తీ ప్రక్రియ లేకపోవటంతో క్రమంగా ఆర్టీసీలో ఖాళీల సంఖ్య కూడా పెరుగుతూ వచ్చి సమస్యలు పెరుగుతున్నాయి. దీంతో రెగ్యులర్ ఉద్యోగుల భర్తీ జరిగే వరకు తాత్కాలిక పద్ధతిలో ఔట్సోర్సింగ్ ఉద్యోగులను నియమించుకునేందుకు సంస్థ నిర్ణయించింది.
రెండు నెలల క్రితం 1,000 మంది డ్రైవర్లను ఇదే పద్ధతిలో నియమించుకుంది. శిక్షణ పూర్తి చేసుకొని వారు విధుల్లో ఉన్నారు. ఆ తర్వాత కండక్టర్లను కూడా అదే పద్ధతిలో నియమించుకునేందుకు కసరత్తు చేసినా, సచివాలయం నుంచి అనుమతి రాలేదు. మరోసారి విన్నవించగా, రవాణా మంత్రి కార్యాలయం తాజాగా అనుమతించింది. దీంతో నోటిఫికేషన్ జారీకి ఏర్పాట్లు ప్రారంభించింది. హైదరాబాద్ నగరంలో దాదాపు 600 మంది కండక్టర్లు, వరంగల్ రీజియన్ పరిధిలో 200 మందిని ఔట్సోర్సింగ్ పద్ధతిలో నియమించుకునేందుకు చర్యలు ప్రారంభించింది.
» ఇలా నియమితులయ్యే వారికి నెలవారీ కన్సాలిడేటెడ్ పేమెంట్ రూ.17,969గా నిర్ధారించారు.
» ప్రతి అదనపు గంట ఓటీకి రూ.100, గంట మించితే రూ.200 చొప్పున చెల్లిస్తారు.
» ప్రతి 6 మస్టర్ల తర్వాత వీక్లీఆఫ్ వసతి ఉంటుంది.