హత్య చేసి మృతదేహం పక్కనే కూర్చున్న నిందితుడు | Mancherial married woman incident | Sakshi
Sakshi News home page

హత్య చేసి మృతదేహం పక్కనే కూర్చున్న నిందితుడు

Dec 9 2025 1:51 PM | Updated on Dec 9 2025 5:55 PM

Mancherial married woman incident

మంచిర్యాల జిల్లా: తనతో సన్నిహితంగా ఉంటూ మరొకరితో తరచూ ఫోన్‌లో మాట్లాడుతుందన్న కారణంతో ఓ యువకుడు వివాహితను దారుణంగా హత్య చేసిన ఘటన భైంసాలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. భైంసా మండలం కుంసర గ్రామానికి చెందిన అశ్విని(28)కి భైంసా పట్టణంలోని పులేనగర్‌కు చెందిన జోంద్లే సంతోష్‌తో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం.

దంపతుల మధ్య విబేధాల కారణంగా కొన్నేళ్లుగా భర్తతో విడిపోయి తన ఇద్దరు పిల్లలతో కలిసి కుంసరలో తల్లి వద్ద ఉంటోంది. ఈ క్రమంలో అంబేడ్కర్‌నగర్‌కు చెందిన నాగేశ్‌తో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కలిసి సంతోషిమాత నగర్‌లో టీ స్టాల్‌ నడుపుతున్నారు. సోమవారం ఇద్దరూ టీస్టాల్‌కు రాగా, అశ్విని మరొకరితో తరచూ ఫోన్‌లో మాట్లాడుతుందన్న కారణంతో గొడవపడ్డాడు. ఈ క్రమంలో మాటామాటా పెరగడంతో కోపంతో నాగేశ్‌ పక్కనే ఉన్న రాడ్‌తో అశ్విని తలపై మోది కత్తితో గొంతుకోయడంతో అక్కడికక్కడే మృతి చెందింది. 

విషయం తెలుసుకున్న పట్టణ సీఐ జి.గోపినాథ్‌ ఘటనాస్థలికి వెళ్లి పరిశీలించారు. క్లూస్‌ టీంను రప్పించి ఆధారాలు సేకరించారు. మృతదేహం వద్దే కూర్చున్న నాగేశ్‌ తానే హత్య చేశానని ఒప్పుకున్నట్లు సీఐ పేర్కొన్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఏరియాస్పత్రికి తరలించారు. భైంసా ఏఎస్పీ రాజేశ్‌మీనా ఆస్పత్రిలో మృతదేహాన్ని పరిశీలించారు. మృతురాలి తల్లి గాయక్వాడ్‌ భారతిబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement