
- దేశంలో రెండో గ్రామం
- దక్షిణ భారత దేశంలో మొదటి గ్రామం
సంపూర్ణ సౌర విద్యుత్ గ్రామంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లి గుర్తింపు పొందనుంది. నాగర్ కర్నూల్ జిల్లా వంగూర్ మండలంలో అచ్చంపేట నియోజకవర్గం పరిధిలో కొండారెడ్డిపల్లి గ్రామం ఉంది.
దేశంలో రెండో గ్రామంగా, దక్షిణ భారతదేశంలో మొదటి గ్రామంగా తీర్చిదిద్దుటకు చేపట్టిన పనులు దాదాపు పూర్తయ్యాయి. TG REDCO ద్వారా రూ 10.53 కోట్లతో 514 ఇండ్లతో , పాటు 11 ప్రభుత్వ భవనాలకు సౌర విద్యుత్ ప్రాజెక్టును ప్రభుత్వం మంజూరు చేసింది.
ప్రతి ఇంటికి 3 KW స్థాపిత సామర్ధ్యంతో 480 ఇండ్లకు సౌర విద్యుత్ వసతిని కల్పించారు. అలాగే 60 KW సామర్ధ్యం కలిగిన 11 ప్రభుత్వ భవనాలకు సౌర విద్యుత్ పరికరాలు బిగించారు. మొత్తం సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యం 1,500 KW ఉన్నది. మట్టి గోడలతో ఉన్న 34 ఇండ్ల కుటుంబాలు కూడా సౌర విద్యుత్ పరికరాలు ఏర్పాటుకు అనుకూలంగా ఉన్నాయి. ఈ కుటుంబాలకు ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పూర్తయిన వెంటనే, ఇండ్ల పైన సౌర విద్యుత్ పరికరాలు బిగించనున్నట్లు TG REDCO ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మేనేజర్ కె. మనోహర్ రెడ్డి తెలిపారు.
కొండారెడ్డిపల్లి గ్రామం సౌర విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ. 10.53 కోట్లు . అందులో రూ.7.96 కోట్ల వ్యయంతో సౌర విద్యుత్ పరికరాలు ఏర్పాటుకు కేటాయించారు. సౌర విద్యుత్ కు కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ రూ.3.56 కోట్లు , M/s Premier Energies కంపెనీ నుండి కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) నిధుల నుండి రూ 4.092 కోట్లు భరించారు. మరో రూ 2.59 కోట్లను మౌలిక వసతుల అభివృద్ధికి ఖర్చు చేశారు.
ప్రతి ఇంటి నుండి నెలకు 360 యూనిట్స్ విద్యుత్ ఉత్పత్తి అవుతుంది.(ప్రతి KW కు 120 యూనిట్స్ అవుతుంది) ఇండ్ల నుండి ఉత్పత్తి అయ్యే విద్యుత్ ను , ఇంటి వినియోగానికి పోగా,మిగిలిన విద్యుత్ ను గ్రిడ్ కు అనుసంధానం చేశారు. గ్రిడ్ కు పంపే విద్యుత్ యూనిట్ కు రూ 5.25 చొప్పున చెల్లించుటకు లబ్దిదారులతో విద్యుత్ పంపిణీ సంస్థ ఒప్పందం చేసుకున్నది. సెప్టెంబర్ నెలలో విద్యుత్ గ్రిడ్ కు గ్రామం మొత్తం నుండి సుమారు ఒక లక్ష యూనిట్స్ విద్యుత్ ఎగుమతి అయింది. తద్వారా రూ 5 లక్షలు ఆదాయాన్ని గ్రామస్తులు ఒక నెలలోనే ఆర్జించారు.