
పచ్చిక బయళ్లు, ఉద్యానవనాలు, బోర్డ్వాక్లు
85 ఎకరాలు, సుమారు రూ.75 కోట్ల వ్యయం
ఆగస్టు 15 నాటికి ప్రారంభించే అవకాశం
పార్కును సందర్శించిన సీఎస్ తదితరులు
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ ప్రమాణాలతో చేపట్టిన కొత్వాల్గూడ ఎకో పార్కు (Kothwalguda Eco Park) ప్రాజెక్ట్ తుదిదశకు చేరుకుంది. హిమాయత్సాగర్కు చేరువలో, ఔటర్రింగ్ రోడ్డు అంచుల్లో ఆకుపచ్చ అందాలతో పార్కు రూపుదిద్దుకుంటోంది. 2022 అక్టోబర్లో 85 ఎకరాల విస్తీర్ణంలో రూ.75 కోట్ల అంచనాలతో ప్రభుత్వం ఎకో పార్కు నిర్మాణం చేపట్టింది. ఎన్నో వైవిధ్యభరితమైన ప్రత్యేకతలతో ఏర్పాటు చేస్తోన్న కొత్వాల్గూడ ఎకోపార్కును ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, పురపాలకశాఖ కార్యదర్శి ఇలంబర్తి, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ తదితర ఉన్నతాధికారులు శుక్రవారం సందర్శించారు.
పంద్రాగస్టు నాటికి పార్కును ప్రారంభించే దిశగా పనులు కొనసాగుతున్నాయి. పార్కు ప్రవేశ ద్వారం వద్ద వెదురు అల్లికలతో అందమైన ఆర్చ్ ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. సహజత్వం ఉట్టిపడేలా ఈ ఆర్చ్ను ఏర్పాటు చేసేందుకు అవసరమైన వెదురును థాయ్లాండ్ నుంచి తెప్పించనున్నారు. ఇందుకోసం నెల రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. వెదురు అల్లికల ఆర్ట్ పని పూర్తి కాగానే పార్కును ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయనున్నారు.
ఎన్నో ప్రత్యేకతలు..
⇒ ఇటు ఐటీ కారిడార్ల నుంచి అటు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు ఉన్న వివిధ కాలనీలు, ప్రాంతాలకు చెందిన ప్రజలకు ఒక అద్భుతమైన ఆటవిడుపు.
⇒ అందమైన కాలక్షేపంగా ఎకో పార్కు కనువిందు చేయనుంది. పుట్టిన రోజు, పెళ్లిరోజు వంటి వేడుకలకు అవసరమైన వేదికలు, లగ్జరీ సదుపాయాలతో దీన్ని రూపొందించారు.
⇒ పార్కులో ఏర్పాటు చేసిన ఏవియరి (పక్షుల గ్యాలరీ) సందర్శకులను విశేషంగా ఆకట్టుకోనుంది. రకరకాల పక్షుల కిలకిలలతో ఆహ్లాదాన్ని పంచేవిధంగా దీన్ని ఏర్పాటు చేశారు.
⇒ 2.5 కి.మీ.లతో ఎలివేటెడ్ వాక్ వేలను నిర్మించారు. నగరవాసులు ఉదయం, సాయంత్రం ఈ వాక్వేలపై నడకకు వెళ్లవచ్చు. విశాలమైన పచ్చిక బయళ్లతో పాటు, అందమైన పూల వనాలను ఏర్పాటు చేశారు. బటర్ఫ్లై పార్కు మరో ప్రత్యేకత. సీజనల్ ఉద్యాన వనాలు మరో ప్రత్యేకత.
చదవండి: అక్కడ ట్రాఫిక్ జామ్.. ఇలా వెళ్లండి!