ఏఐ, హెల్త్ సిటీ, డేటా సెంటర్,లైఫ్ సైన్సెస్ హబ్లు
నివాస సముదాయాలతోపాటు విద్య, వైద్యం, క్రీడా కేంద్రాలు
11 జోన్లకు 13,610 ఎకరాల భూ కేటాయింపులు
జూన్ 2న ఎఫ్సీడీఏ కార్యాలయం ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీని విద్య, వైద్యం, వినోదం, నివాస, వాణిజ్య, పారిశ్రామిక, తయారీ.. ఇలా ప్రత్యేక జోన్లుగా విభజిస్తూ బృహత్ ప్రణాళిక సిద్ధమైంది. పర్యావరణానికి అత్యధిక ప్రాధాన్యంఇస్తూ నెట్ జీరో సిటీగా రూపుదిద్దుకోనున్న ఈ ఫ్యూచర్ సిటీలో అన్ని రంగాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. 11 జోన్లుగా అభివృద్ధి చేయనున్న ఈ ఫోర్త్ సిటీలో 13,610 ఎకరాల్లో అన్ని రంగాలకు భూ కేటాయింపులు చేశారు. అత్యధికంగా 4 వేల ఎకరాలు లైఫ్ సైన్స్ హబ్కు కేటాయించగా.. నివాస సముదాయాలకు 2,477 ఎకరాలను కేటాయించారు.
762 చ.కి.మీ...
హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తరహాలో గ్రేటర్లో నాల్గో నగరం ఆవశ్యకత ఏర్పడిందని, దీన్ని పట్టణ, పారిశ్రామిక అభివృద్ధి కేంద్రంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించిన సీఎం రేవంత్ రెడ్డి భారత్ ఫ్యూచర్ సిటీకి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆమన్గల్, ఇబ్రహీంపట్నం, కడ్తాల్, కందుకూరు, మహేశ్వరం, మంచాల, యాచారం ఏడు మండలాల్లోని 56 గ్రామాలతో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ (ఎఫ్సీడీఏ)ను ఏర్పాటు చేశారు. 762 చ.కి.మీ. మేర విస్తరించి ఉన్న ఈ ఎఫ్సీడీఏలో 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ ఉంటుంది. ఇందులో 15 వేల ఎకరాలు అభయారణ్యం ఉండగా.. మిగిలిన 15 వేల ఎకరాల్లో ఫోర్త్ సిటీని అభివృద్ధి చేయనున్నారు.
జూన్ 2న కార్యాలయం ప్రారంభం
రాష్ట్రావతరణ దినోత్సవం జూన్ 2న ఎఫ్సీడీఏ కార్యాలయం ప్రారం¿ోత్సవానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. మీర్ఖాన్పేటలో ఎఫ్సీడీఏ కార్యాలయం కోసం ప్రభుత్వం 7.29 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. జీ+1 అంతస్తుల్లో, 16,393 చదరపు అడుగుల విస్తీర్ణంలో హరిత భవన ప్రమాణాలకు అనుగుణంగా నిర్మిస్తున్నారు. ఇందులో కాన్ఫరె¯న్స్ హాల్, ఎక్స్పీరియన్స్ సెంటర్ వంటి ప్రత్యేక గదులుంటాయి.


