TG: రెండు జిల్లాలో భీకర వర్షం.. ఈ రాత్రి ఎలా గడిచేనో.. | Heavy Rain Falling In Mahabubabad And Khammam | Sakshi
Sakshi News home page

TG: రెండు జిల్లాలో భీకర వర్షం.. ఈ రాత్రి ఎలా గడిచేనో..

Sep 7 2024 8:23 PM | Updated on Sep 8 2024 7:07 AM

Heavy Rain Falling In Mahabubabad And Khammam

సాక్షి, ఖమ్మం/మహబూబాబాద్‌: తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి.  ఇటీవల కురిసిన వర్షాల నుంచి కోలుకునేలోపే మరోసారి మహబూబాబాద్‌, ఖమ్మంలో శనివారం మళ్లీ భారీ వర్షం కురుస్తోంది. కుండపోతగా కురుస్తున్న వర్షం ధాటికి ఇళ్లలోకి వరద నీరు చేరుతోంది.

ఇక, శనివారం సాయంత్రం నుంచి మహబూబాబాద్‌ జిల్లా కేంద్రం సహా బయ్యారం మండలంలో ఉరుములతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. దీంతో, జిల్లా కేంద్రంలోని పలు కాలనీల్లోకి వరద నీరు వచ్చి చేరింది. పలు కాలనీలు జలమయం అయ్యాయి. ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. అటు.. బయ్యారంలో జగ్నతండా జల దిగ్బంధమైంది. అన్ని వైపుల నుంచి వరద చుట్టుముట్టడంతో తండాలోని ఇళ్లలోకి వరద నీరు చేరుకుంది. ఈ నేపథ్యంలో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.

దీనిపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లాలో కురిసిన భారీ వర్షాల వలన మరోసారి పెరుగుతున్న మునేరు వాగు ప్రవాహం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని, ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుంటోందన్నారు. అవసరమైతే సహాయక శిబిరాలు మళ్లీ తెరవాలని అధికారులను ఆదేశించారు.

జిల్లాలో లోతట్టు ప్రాంతాలలో ఉన్న ప్రజలు వెంటనే అక్కడినుండి తరలి, ప్రభుత్వం ఏర్పాటు చేసిన సహాయ శిబిరాలకు వెళ్లాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ సూచనలను పాటించి, తగినంత జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో సంబంధిత అధికారులతో సంప్రదించాలని కోరారు. అధికారులు వెంటనే అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశించారు.  ప్రస్తుత పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వచ్చేవరకు, ప్రజలకు సహాయ సేవలు నిరంతరం అందుబాటులో ఉంచేందుకు అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందని తెలిపారు.

 

 

మరోవైపు.. ఖమ్మంలో కూడా మరోసారి పరిస్థితి దారుణంగా మారాయి. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మున్నేరుకు వరద పెరిగే అవకాశం ఉంది. శనివారం అర్ధరాత్రి తర్వాత మున్నేరు ఉధృతి పెరిగే సూచనలు ఉండటంతో కేఎంసీ అధికారులు అలర్ట్‌ అయ్యారు. కమిషనర్‌.. అధికారులను అందరినీ అత్యవసరంగా ఆఫీసుకు పిలిపించారు. ముంపు ప్రాంతాలను ఖాళీ చేసి పునరావాస కేంద్రాలకు వెళ్లాలని  అధికారులు ప్రజలకు సూచించారు.

 

 

Advertisement
 
Advertisement
Advertisement