సాక్షి,సిద్ధిపేట: ఉచిత విద్యుత్ కరెంట్ విషయంలో బడేభాయ్ చెప్పినట్టు సీఎం రేవంత్ నడుస్తున్నట్లు కనిపిస్తోంది. డిస్కంల విషయంలో సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతున్నది వేరు.. వాస్తవం వేరని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఆదివారం (మే29) సిద్ధిపేటలో ఆయన మీడియాతో మాట్లాడారు.
24గంటల విద్యుత్ ఇవ్వడం కోసమే రైతు డిస్కం ఏర్పాటు చేశామని సీఎం రేవంత్ అంటున్నారు. కానీ వాస్తవం ఏంటంటే? రైతు డిస్కంతో 24 గంటల ఉచిత విద్యుత్ రానే రాదు. రైతు డిస్కం రైతులకు ఉరి తాడుగా మారబోతుంది.లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ల పాలిట రైతు డిస్కం శాపంగా మారుతుంది. మేం పద్దతిగా ఆధారాలతో మాట్లాడుతాం. రేవంత్ రెడ్డిలా బట్ట కాల్చి మీద వేయం.
ఆర్పీడీసీఎల్ ఏర్పాటుతో కనీసం ఏడు గంటల కరెంట్ కూడా రాదు. 13గంటలకు మించి రైతులకు కరెంట్ రావడం లేదు. రైతులకు మూడు గంటలు కరెంట్ చాలు అని కోదండరెడ్డి మాట్లాడుతున్నారు.
గుజరాత్లో రైతులకు ఏడుగంటలే కరెంట్ ఇస్తున్నారు. 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చే ఓట్లు అడుగుతానని రేవంత్ చెప్పాలి. రేవంత్ ప్రభుత్వం 24 గంటల ఉచిత విద్యుత్కు మంగళం పాడింది. టీజీఆర్పీడీసీఎల్ థర్మల్ పవర్ ఇవ్వరట.. సోలార్ పవర్ మాత్రమే ఇస్తారట. బడేభాయ్ చెప్పినట్టు రేవంత్ నడుస్తున్నట్లు కనిపిస్తోంది. వరద వచ్చినప్పుడే ప్రాజెక్టులు నింపుకోవాలి’ అని వ్యాఖ్యానించారు.


