
డ్రోన్ ఆధారిత జీఐఎస్ సర్వేతో వెల్లడవుతున్న వివరాలు
కబ్జాలకు తావు లేకుండా ఇక కట్టుదిట్టమైన చర్యలు
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీకి ఎన్నో ఆస్తులున్నాయి. వాటిల్లో కమ్యూనిటీ హాళ్లు, షాపింగ్ కాంప్లెక్స్లు, మార్కెట్లు, చెరువులు, పార్కులు, స్పోర్ట్స్ స్టేడియంలు, ఆటస్థలాలు, ఫంక్షన్హాళ్లు, పబ్లిక్ టాయ్లెట్లు తదితరమైనవెన్నో ఉన్నాయి. అయినా తమకున్న ఆస్తులేమిటో, ఏవి ఎక్కడ ఏ పరిస్థితుల్లో ఉన్నాయో, ఏ దుస్థితిలో కునారిల్లుతున్నాయో, ఏ అక్రమార్కుల కబ్జాలో చిక్కుకున్నాయో, ఎక్కడ ఏ ప్రైవేటు పెత్తనంతో ఉన్నాయో కూడా జీహెచ్ఎంసీ అధికారులకు తెలియదు.
అంతెందుకు ఒక పార్కు సమీపంలోని స్థలం కబ్జా అయితే అది జీహెచ్ఎంసీదా, కాదా, అనేది మేయర్కు సైతం తెలియలేని పరిస్థితుల్లో ఆ ఆస్తులున్నాయి. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఒక మంచి నిర్ణయం తీసుకుంది. అత్యాధునిక టెక్నాలజీ వినియోగం ద్వారా ఆస్తులను గుర్తించే పని చేపడుతోంది. ఆస్తిపన్ను ఆదాయం పెంచుకునేందుకు ప్రజల ఆస్తుల సర్వే చేపట్టిన జీహెచ్ఎంసీ (GHMC).. తమ ఆస్తుల్ని కూడా తెలుసుకునేందుకు పనిలోపనిగా ‘డ్రోన్ బేస్డ్ జీఐఎస్ సర్వే’ను ప్రారంభించింది.
వీటి సర్వే ఇలా...
సర్వేలో భాగంగా ఆటస్థలాలు, పార్కులు, పబ్లిక్ టాయ్లెట్లు, స్పోర్ట్స్ కాంప్లెక్సుల వివరాలు క్రోడీకరించి.. వాటిని జియో మ్యాపింగ్ కూడా చేశారు. అక్షాంక్ష, రేఖాంశాలతో సహ మ్యాపింగ్ చేయడంతో ఇక జీహెచ్ఎంసీ ఆస్తులు ఏ లొకేషన్లో, ఏ స్థితిలో ఉన్నాయో కూడా అధికారులు తెలుసుకునే సౌలభ్యం ఏర్పడింది. కానీ, కమ్యూనిటీ హాళ్ల వంటి వాటి సర్వే ఇంకా చేపట్టలేదు. చాలా వరకు కమ్యూనిటీ సెంటర్లు స్థానిక లీడర్లు, కార్పొరేటర్ల చేతుల్లో ఉన్నాయి. ఎప్పుడైనా జీహెచ్ఎంసీకి ఏదైనా అవసరం వచ్చినా వాటి తాళాలు ఎవరి దగ్గర ఉన్నాయో తెలియక వెతుక్కునే పరిస్థితి. కాబట్టి కమ్యూనిటీ హాళ్ల విషయంలో గట్టి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది.
కట్టుదిట్టమైన చర్యలు
మొత్తానికి జీహెచ్ఎంసీ ఆస్తుల్ని జీఐఎస్ పోర్టల్లో మ్యాపింగ్ చేస్తున్నారు. వాటిని కబ్జాల పాలు కాకుండా, జులాయిలు తిష్టవేయకుండా చూస్తామని, అద్దెల కివ్వడం, అవసరమైన సేవలందించడం ద్వారా ప్రయోజనకరంగా తీర్చిదిద్దుతామని అధికారులు చెబుతున్నారు.
చదవండి: హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ బూమ్.. 1,48 గజాలు.. రూ.33 కోట్లు