
రాష్ట్రంలో పేరుకుపోయిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు
రెండేళ్లలో సుమారు రూ. 4,900 కోట్లు పెండింగ్
ఫీజులు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు జారీ చేస్తున్న కాలేజీ యాజమాన్యాలు.. గత్యంతరం లేక అప్పులు చేసి ఫీజులు కడుతున్న తల్లిదండ్రులు
ఎల్బీనగర్కు చెందిన బి. మనస్విని గండిపేటలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ ఫైనలియర్ పూర్తి చేసింది. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కింద అర్హత సాధించిన ఆమె ఏటా దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఇప్పటివరకు పైసా విడుదల కాలేదు. కన్వినర్ కోటాలో సీటు పొందిన కూతురి కోసం తల్లిదండ్రులు నాలుగేళ్లపాటు ట్యూషన్ ఫీజు కోసం అప్పు చేసి రూ. 6 లక్షల వరకు చెల్లించారు. ఇప్పుడు ఆ అప్పుపై వారు వడ్డీ చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరుకు చెందిన ఎం.కీర్తి బాచుపల్లిలోని ఓ ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ (థర్డ్ ఇయర్ పూర్తి చేసింది) చదువుతోంది. ఆమెకు మూడేళ్లుగా ఫీజు రీయింబర్స్మెంట్ అందలేదు. ఫీజు కోసం తొలి ఏడాది కాలేజీ యాజమాన్యం ఒత్తిడి చేయనప్పటికీ రెండు, మూడో సంవత్సరంలో ఫీజుల కోసం యాజమాన్యం ఒత్తిడి చేసింది. ఫీజు కడితేనే పరీక్షలకు అనుమతిస్తామని చెప్పడంతో ఇప్పటివరకు రూ. 4.5 లక్షలు చెల్లించింది. వచ్చే నెలాఖరులోగా ఫైనలియర్ ఫీజు రూ. లక్షన్నర కట్టాలని యాజమాన్యం స్పష్టం చేయడంతో డబ్బు కోసం ఆమె కుటుంబం అప్పు కోసం ప్రయత్నిస్తోంది.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాలేజీ విద్యార్థులకు అమలు చేస్తున్న ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాల బకాయిలు భారీగా పేరుకుపోయాయి. గత రెండేళ్లలో సుమారు రూ. 4,900 కోట్ల మేర బకాయిలు ఉన్నట్లు సంక్షేమ శాఖల గణాంకాలు చెబుతున్నాయి. అలాగే అంతకు ముందు బకాయిలు సుమారు మరో రూ. 2 వేల కోట్లు ఉన్నాయి. బకాయిల్లో కొన్నింటికి టోకెన్లు జారీ అవగా మరికొన్ని మంజూరు దశలోనే ఉండిపోయాయి.
పరిశీలనకే పరిమితం...
ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కింద వస్తున్న దరఖాస్తులు పరిశీలనకే పరిమితమవుతున్నాయి. ఏటా సగటున 12.5 లక్షల మంది విద్యార్థులు ఈ పథకాల కింద దరఖాస్తు చేసుకుంటున్నారు. ఏటా దాదాపు ఆరు నెలలపాటు దరఖాస్తుల సమర్పణ ప్రక్రియ సాగుతుంది. ఆన్లైన్లో వస్తున్న దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించి అర్హతలను నిర్ధారించి మంజూరు చేయడం వరకే సంక్షేమ శాఖలు పరిమితమవుతున్నాయి. ఆ తర్వాత ట్రెజరీలకు బిల్లులు పంపుతండగా ఆర్థిక శాఖ వద్ద ఈ ఫైళ్లు పెండింగ్లో ఉంటున్నాయి.
ఖజానా విభాగంలో రూ. 1,150 కోట్ల బిల్లులు..
సంక్షేమ శాఖ అధికారులు దరఖాస్తులను పరిశీలించి వాటిని బిల్లుల రూపంలో ఖజానా శాఖకు పంపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే బీఆర్వో (బడ్జెట్ రిలీజ్ ఆర్డర్)లకు అనుగుణంగా ఆర్థిక శాఖ ఆయా బిల్లులను పాస్ చేస్తుంది. ఈ నేపథ్యంలో రూ. 1,150 కోట్ల విలువైన బిల్లులకు ఖజానా విభాగంలో టోకెన్లు జారీ అయ్యాయి. ప్రభుత్వం నిధులు విడుదల చేసిన వెంటనే వాటికి మోక్షం కలుగుతుంది.
అయితే ప్రస్తుతం టోకెన్ల రూపంలో పెండింగ్లో ఉన్న బకాయిలన్నీ 2021–22, 2022–23 విద్యాసంవత్సరానికి సంబంధించినవే కావడం గమనార్హం. మరోవైపు సకాలంలో నిధులు విడుదల చేయకపోవడంపై కళాశాలల యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం నిధులు విడుదల చేశాక వాటిని తిరిగి చెల్లిస్తామని విద్యార్థుల తల్లిదండ్రులకు చెబుతూ ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడే ప్రయత్నం చేస్తున్నాయి.