కారణాలేంటో తెలపండి: హైకోర్టు

Ex TSRTC Employees HC Petition For Non Provision Of Medical Treatment In Tarnaka - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ మాజీ ఉద్యోగులకు తార్నాకలోని ఆసుపత్రిలో వైద్య సేవలు ఎందుకు అందించడం లేదో.. కారణం తెలపాలని టీఎస్‌ఆర్టీసీ, ఏపీఎస్‌ఆర్టీసీని హైకోర్టు ఆదేశించింది.  కౌంటర్‌ దాఖలు చేయాలని నోటీసులు జారీ చేసింది. వైద్య సేవలు అం దించేలా ఆదేశించాలని కోరుతూ ఆర్టీసీ రిటైర్డ్‌ ఆఫీసర్స్‌ వెల్‌ఫేర్‌ అసోసియేషన్, మాజీ ఉద్యోగి వీఎల్‌ఎన్‌ మూర్తి కోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీష్‌చంద్రశర్మ, జస్టిస్‌ అభినంద్‌కుమార్‌ షావిలి ధర్మా సనం విచారణ చేపట్టింది. 2003లో పదవీ విరమ ణ పొందిన ఉద్యోగులకు వైద్య సౌకర్యాల కల్పన మొదలైందని, ఇందుకు ఒక్కో ఉద్యోగి రూ.35 వేల వరకు చెల్లించారని పిటిషనర్ల తరఫు న్యాయవాది ఏకే జయప్రకాశ్‌రావు కోర్టుకు నివేదించారు. ఇలా తెలంగాణ రీజియన్‌లోనే రూ.6 కోట్ల చెల్లింపులు జరిగాయన్నారు.

రాష్ట్ర విభజన నేపథ్యంలో తార్నాక ఆస్పత్రిని ఎంచుకున్నారని, అయితే ఆంధ్ర లో చదివారనే కారణంగా  మాజీ ఉద్యోగులకు వైద్య సదుపాయాలు, ఇతర ప్రయోజనాలను కొనసాగించకపోవడం చట్టవిరుద్ధమని వివరించారు. హైదరాబాద్‌లో స్థిరపడిన పిటిషనర్లు విజయవాడ వెళ్లి వైద్యసేవలు పొందలేరని, వైద్యం అందించకపోవడం సహజ న్యాయ సూత్రాలను ఉల్లంఘించడమే అవుతుందని చెప్పారు. వాదనలు విన్న ధర్మాసనం కారణాలు తెలపాలంటూ టీఎస్‌ఆర్టీసీ వైస్‌చైర్మన్, ఎండీకి.. ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీకి నోటీసులు జారీ చేసింది. ఆగస్టు 25లోగా కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణ వాయిదా వేసింది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top