
గ్రీవెన్స్లో ఓ కన్నతల్లి కన్నీటి పర్యంతం
నా కొడుకు పుట్టుక నుంచేనడువలేడు..కింద కూసోలేడు. 30 ఏళ్ల వయసు వచ్చినా సంటి పిల్లగాడి లెక్క సేవలు చేయాలె. వచ్చే పింఛన్ డైపర్లకు కూడా సరిపోతలేదు. కూలికి పోతేనే కుటుంబం గడిచేది. కిరాయిఇంటికి జీరో కరెంటు బిల్లు వస్తలేదు. ఇందిరమ్మ ఇల్లుమంజూరు కాలేదు. ఏ ఆసరా లేదు. కొడుకు గోస సూడలేక పోతన్న. సాదుడు కష్టమైతంది. ఆదుకోండి.. లేదంటే కొడుకును సంపుండి..
జనగామ మున్సిపాలిటీ పరిధిలోని 21వ వార్డు కురుమవాడకు చెందిన పర్శ మల్లయ్య–లక్ష్మి దంపతులకు కుమారుడు సాయి, కూతురు ఉన్నారు. కొడుకు వయసు ప్రస్తుతం 30 సంవత్సరాలు. పుట్టుకతోనే కాళ్లు, చేతులు చచ్చుబడి పోయి కనీసం కూర్చోలేని పరిస్థితి. తండ్రి ఎంసీహెచ్లో వాటర్మెన్గా.. తల్లి సాయిబాబా ఆలయంలో కూలి చేస్తూ పిల్లలను పోషించుకుంటున్నారు. ఇద్దరూ పనికి వెళితేనే కుటుంబం గడిచేది.
ఇద్దరూ పనులకు పోతే కొడుకుని ఇంట్లో ఉంచి వెళ్లాల్సిందే. ప్రభుత్వం నుంచి వచ్చే దివ్యాంగుల పింఛన్ రూ.4వేలు డైపర్లకు సైతం సరిపోవడం లేదు. మందులు, నెలవారి వైద్య ఖర్చులకు అప్పులు చేస్తున్నారు. అద్దె ఇంట్లో కాలం గడుపుతున్నారు. సర్కారు ఇచ్చే జీరో కరెంటు బిల్లుకు దరఖాస్తు చేసినా వస్తలేదు. ఇందిరమ్మ ఇల్లు కోసం దరఖాస్తు పెట్టినా మంజూరు కాలేదు.
సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన గ్రీవెన్స్కు మల్లయ్య తన కొడుకును భుజాన ఎత్తుకొని వచ్చారు. ‘మేము ప్రభుత్వ పథకాలకు అర్హులం కాదా.. మంజూరు చేయకుంటే నా కొడుకును సంపేయండి’అంటూ కొడుకు సాయిని అక్కడే పడుకోబెట్టిన తల్లి లక్ష్మి అదనపు కలెక్టర్ రోహిత్సింగ్ ఎదుట బోరున విలపించింది. స్పందించిన అదనపు కలెక్టర్ సంబంధిత అ«ధికారులను పిలిచి వీరి సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.