సాక్షి, హైదరాబాద్: మోంథా తీవ్ర తుపాను కారణంగా సోమవారం నుంచి తెలంగాణ జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. అయితే రెడ్ అలర్ట్ జారీ చేసిన నాలుగు జిల్లాల్లో ఇవాళ భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, పెద్దపల్లి జిల్లాల్లో ఇవాళ, రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉంది. మోంథా ప్రభావంతో ఇవాళ మూడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 21 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఆదిలాబాద్, జనగామ, ఖమ్మం, కొమురంభీం, మంచిర్యాలలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం పడొచ్చని, అలాగే.. సిద్ధిపేట, సూర్యాపేటలో అక్కడక్కడా భారీ వర్షాలు పడతాయని అధికారులు అంటున్నారు.
హైదరాబాద్కు భారీ వర్ష సూచన నేపథ్యంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. అలాగే రేపు(బుధవారం) నాలుగు జిల్లాలకు ఆరెంజ్, 12 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. తుపాన్ తీరం దాటే సమయంలో.. ఇటు తెలంగాణలోనూ గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ చెబుతోంది. తుపాను ప్రభావంతో మరో మూడు రోజులు వర్షాలు తప్పవని అధికారులు అంటున్నారు.
మోంథా నేపథ్యంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. సమీక్ష నిర్వహించిన మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి.. అకాల వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. రైతులు నష్టపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచిస్తూనే.. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు.
క్లిక్ చేయండి: కాకినాడకు చేరువలో మోంథా.. బీభత్సం చూశారా?


