
హైదరాబాద్: నగరంలో వర్షాలతో తలెత్తే ఇబ్బందులకు, వరర సమస్య పరిష్కారంపై ఈరోజు(శుక్రవారం, ఆగస్టు 8వ తేదీ) సీఎం రేవంత్రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇందుకు సంబంధించిన అన్ని విభాగాల అధికారుల అభిప్రాయాలను సీఎం రేవంత్ తీసుకున్నారు. నిన్న (గురువారం, ఆగస్టు 7వ తేదీ) రాత్ర కురిసిన వర్షానికి హైదరాబాద్ నగరం అతలాకుతలమైన పరిస్థితులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. వరదనీటి ప్రవాహానికి అడ్డంకులు ఉండటమే నగరంలో ఈ దుస్థితి తలెత్తుతోందన్న అధికారులు స్పష్టం చేశారు.
దీనిలో భాగంగా అధికారులకు పలు సూచనలు చేశారు సీఎం రేవంత్.. ‘ ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న కోర్ అర్బన్ రీజియన్ లోని వరదనీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలి. హైదరాబాద్ నగరంలోని వరదనీరు మూసీని చేరేలా ప్రణాళికలు సిద్ధం చేయండి.
ప్రతీ చెరువు, నాలాలు, ఇతర కాలువలను మూసీకి అనుసంధానం చేయండి. చెరువులను పునరుద్ధరణ, నాలాలను వెడల్పు ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయండి. ఎక్కడ వర్షం పడినా నీరు చెరువుల్లోకి, నాలాల్లోకి, అటునుంచి మూసీలోకి చేరేలా చర్యలు చేపట్టండి. భవిష్యత్ లో నగరంలో ఇలాంటి సమస్య పునరావృతం కాకుండా ఉండాలంటే మూసీ పునరుజ్జీవనం అవసరం. మూసీ పునరుజ్జీవనమే వరద సమస్యకు శాశ్వత పరిష్కారమని ఆ దిశగా ప్రణాళికలు రూపొందించండి. మూసీ పునరుజ్జీవనంతో వర్షాకాలంలో నీటి ప్రవాహం, ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టొచ్చు. ఆ దిశగా హైదరాబాద్ నగర అభివృద్ధికి ప్రణాళికలు సిద్దం చేయండి’ అని అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేశారు.