ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌పై వరకట్న వేధింపుల కేసు | Chevella traffic constable incident | Sakshi
Sakshi News home page

ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌పై వరకట్న వేధింపుల కేసు

Nov 4 2025 8:34 AM | Updated on Nov 4 2025 8:34 AM

Chevella traffic constable incident

హైదరాబాద్: చేవెళ్ల పోలీస్‌స్టేషన్‌లో ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న పాసుల నర్సింహులుతో పాటు ఆయన కుటుంబసభ్యులపై సనత్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో అదనపు కట్నం వేధింపుల (డీపీ యాక్ట్‌) కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన మేరకు.. ఫతేనగర్‌ ప్రభాకర్‌రెడ్డి నగర్‌లో నివాసం ఉండే సౌమ్యకు పరిగి మండలం చిగురుపల్లె గ్రామానికి చెందిన ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ నర్సింహులు (35)తో గత ఏడాది  వివాహం జరిగింది. 

వివాహ సమయంలో సౌమ్య తల్లిదండ్రులు రూ.25 లక్షల నగదు, 500 గ్రాముల బంగారం, సంగారెడ్డి జిల్లా మనూరు గ్రామంలో 242 చదరపు గజాల స్థలం, గృహోపకరణాలను కట్నంగా ఇచ్చారు. వివాహానంతరం దంపతులు చందానగర్‌లో నివాసం ఉండేవారు. కొంతకాలం తర్వాత భర్త నర్సింహులు, అతని కుటుంబ సభ్యులు అదనపు కట్నంగా మరో రూ.10 లక్షల నగదు, హైదరాబాద్‌లో ఒక డబుల్‌ బెడ్‌రూమ్‌ ప్లాట్‌ ఇవ్వాలని సౌమ్యను డిమాండ్‌ చేశారు.  ఈ విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు ఫోన్‌ ద్వారా తెలియజేయగా తాము ఇవ్వలేమని చెప్పారు. 

దీంతో అప్పటి నుంచి నర్సింహులుతో పాటు అతని కుటుంబ సభ్యులు ఆమెను మానసికంగా, శారీరికంగా వేధించడం మొదలుపెట్టారు. పరిగి మండలం చిగురుపల్లె గ్రామంలోని తన అత్తింటికి వెళ్లిన ప్రతిసారీ అత్త పద్మమ్మ, మరిది, మరిది భార్య, భర్త నర్సింహులు కలిసి అదనపు కట్నం కోసం ఒత్తిడి  చేస్తున్నారు. వేధింపులు తట్టుకోలేక  సౌమ్య సనత్‌నగర్‌ పోలీసులను ఆశ్రయించగా నర్సింహులుతో పాటు కుటుంబసభ్యులు పద్మమ్మ, బండయ్య, ఆంజనేయులు, బోయినిస్వరూప, బోయిని శైలులపై  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.   

Advertisement
 
Advertisement
Advertisement