సాక్షి కులకచర్ల: వికారాబాద్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కులకచర్ల మండల కేంద్రంలో భార్య, ఇద్దరు పిల్లలు, వదినను వేపూరి యాదయ్య అనే వ్యక్తి కత్తితో దారుణంగా నరికి చంపాడు. అనంతరం నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
వివరాల ప్రకారం.. యాదయ్య, అలవేలు భార్యాభర్తలు. వారికి అపర్ణ, శ్రావణి ఇద్దరు కుమార్తెలు. రోజువారీ కూలీగా పనిచేసే యాదయ్యకు భార్య అలవేలుపై అనుమానం ఎక్కువ అని కుటుంబ సభ్యులు, స్థానికులు చెబుతున్నారు. ఆమెపై అనుమానంతో ప్రతీరోజు గొడవ పడేవాడని చుట్టుపక్కల వారు తెలిపారు. ఈ క్రమంలోనే వారం రోజులుగా భార్యాభర్తల మధ్య ఘర్షణలు తీవ్రమయ్యాయి. భార్యను యాదయ్య తీవ్రంగా కొట్టినట్టు కూడా తెలిసింది.
దీంతో, ఇద్దరిని రాజీ చేసేందుకు వదిన హన్మమ్మ వారి ఇంటికి వచ్చింది. శనివారం రాత్రి వారి మధ్య చర్చలు జరిగాయి. ఆ తరువాత అందరూ పడుకున్న సమయంలో అర్ధరాత్రి యాదయ్య దారుణానికి ఒడిగట్టాడు. భార్య అలవేలు (32), కూతురు శ్రావణి (13), వదిన హన్మమ్మ (40)ను కోడవలితో గొంతుకోసి హత్య చేశాడు. పెద్దకుమార్తె అపర్ణపై కూడా దాడి చేయబోగా ఆమె తప్పించుకొని పారిపోయింది. ఈ విషయాన్ని చుట్టుపక్కల వారికి చెప్పడంతో.. వారు వచ్చేలోపే యాదయ్య ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. పరిగి డీఎస్పీ శ్రీనివాస్ హత్య జరిగిన ప్రాంతానికి వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. నలుగురు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.


