పెట్టుబడులకు రాష్ట్రం అనువైన ప్రాంతం | bhatti vikramarka about industries in telangana | Sakshi
Sakshi News home page

పెట్టుబడులకు రాష్ట్రం అనువైన ప్రాంతం

Mar 1 2024 5:15 AM | Updated on Mar 1 2024 5:15 AM

bhatti vikramarka about industries in telangana - Sakshi

భట్టితో సింగపూర్‌ కాన్సుల్‌ జనరల్‌ ఎడ్గర్‌ బృందం    

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

భట్టిని కలిసిన సింగపూర్‌ కాన్సుల్‌ జనరల్‌

రాష్ట్రంలో పెట్టుబడులపై చర్చ 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలకు అన్ని రకాలుగా సహకారం అందించడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. పారిశ్రామికవేత్తలు సంపద, ఉద్యోగాల సృష్టికర్తలని కొనియాడారు. పెట్టుబడులను ఆహ్వనించడంలో ప్రభుత్వానికి స్పష్టమైన విధానం ఉందని ఆయన పేర్కొన్నారు. గురువారం సచివాలయంలో సింగపూర్‌ కాన్సుల్‌ జనరల్‌ ఎడ్గర్‌పాంగ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిశారు. పెట్టుబడులు పెట్టడానికి తెలంగాణ అన్ని రకాలుగా అనువైన ప్రదేశమని, ఔటర్‌ రింగ్‌రోడ్డుతోపాటు త్వరలోనే రీజనల్‌ రింగ్‌రోడ్డు కూడా అందుబాటులోకి వస్తుందని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం వివరించారు.

రాష్ట్రంలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల వారీగా పారిశ్రామిక క్లస్టర్లు ఏర్పాటు చేసి, సమగ్ర అభివృద్ధి జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు సింగపూర్‌ కాన్సుల్‌ జనరల్‌కు చెప్పారు. ఫార్మా, టెక్స్‌టైల్, ఐటీ క్లస్టర్లు ఏర్పాటు చేసి.. అభివృద్ధి చేయనున్నట్లు భట్టి పేర్కొన్నారు. మూసీ నది పరీవాహక ప్రాంతం అంతటా కమర్షియల్, పిల్లల పార్కులు, మాల్స్‌ నిర్మాణం చేసి ఆర్థిక కార్యకలాపాలు వేగవంతం చేసే ఆలోచనలో ఉన్నామన్నారు. సింగపూర్‌ పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు అవసరమైన భూమి, వనరులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కాగా, సింగపూర్‌కు చెందిన కొన్ని కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నాయని ఎడ్గర్‌పాంగ్, భట్టి విక్రమార్కకు వివరించారు. పట్టణ ప్రణాళికలో తమకు మంచి పట్టు ఉందని పాంగ్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement