సాక్షి, చైన్నె : అసెంబ్లీ సమావేశాల అనంతరం పార్టీ జనరల్కమిటీ సమావేశం నిర్వహిస్తామని అన్నాడీఎంకే ప్రదానకార్యదర్శి పళణి స్వామి ప్రకటించారు. సోమవారం చైన్నెలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, అన్నాడీఎంకేలోని అన్ని జిల్లాల పరిపాలనా విభాగాల నుంచి అభిప్రాయ సేకరణ కోరామని పళనిస్వామి తెలిపారు. రాబోయే అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే మొదట పార్టీ వర్కింగ్ కమిటీ, ఆ తర్వాత జనరల్ కమిటీ (సాధారణ మండలి) సమావేశాలను నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
టీవీకే ప్రభుత్వానికి అనుభవలేమి..
తమిళనాడులోని టీవీకే ప్రభుత్వానికి ఎలాంటి పరిపాలనా అనుభవం లేదని ఎడప్పాడి విమర్శించారు. పార్టీ స్థాపించి ఏడాది మాత్రమే కావడంతో, కావేరీ నదీ జలాల సమస్యను పరిష్కరించడంలో ఈ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని మండిపడ్డారు. కర్ణాటక ప్రభుత్వం తమ రాష్ట్ర రాజకీయ పార్టీలు, రైతులకు ప్రాధాన్యత ఇస్తూ నిర్ణయాలు తీసుకుంటోందని, అయితే, తమిళనాడు ప్రభుత్వం మాత్రం కావేరీ, మేఘదాతు వివాదాలపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే తమిళనాడులోని అన్ని రాజకీయ పార్టీలు, రైతు సంఘాల ప్రతినిధులు, న్యాయ నిపుణులతో అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని పట్టుబట్టారు.


