సాక్షి,చైన్నె: తమిళనాడు వ్యాప్తంగా ఉన్న రైతులకు వ్యవసాయ రంగంలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించి, వారికి సరైన మార్గదర్శకత్వం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ‘కలందురైయాడల్ మూలమ్ విరివాక్కమ్‘ (చర్చల ద్వారా విస్తరణ) అనే ఈ సరికొత్త వినూత్న పథకాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వినోద్ చైన్నెలో ప్రారంభించారు.
ఒకే వేదికపై అన్ని రంగాల నిపుణులు
ఈ పథకం ద్వారా రైతులు అడిగే ప్రశ్నలకు, వారు ఎదుర్కొంటున్న సమస్యలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేరుగా సమాధానాలు, పరిష్కారాలను అందించనున్నారు. దీనికోసం రాష్ట్ర స్థాయిలో ఒక ప్రత్యేక నిపుణుల కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో వ్యవసాయ రంగంతో పాటు దానికి అనుబంధంగా ఉన్న ఉద్యానవన శాఖ, మత్స్యశాఖ, పశుసంవర్ధక, పాల ఉత్పత్తి శాఖ, అగ్రికల్చరల్ ఇంజినీరింగ్, చైన్నె ప్రాంతీయ వాతావరణ కేంద్ర నిపుణులు, బ్యాంకింగ్ రంగ నిపుణులు, విభాగాధిపతులు భాగస్వామ్యులుగా ఉంటారు.
సచివాలయంలో ప్రారంభోత్సవం
చైన్నెలోని ప్రభుత్వ ప్రధాన సచివాలయంలో జరిగిన ఈ పథకం ప్రారంభోత్సవంలో వ్యవసాయ శాఖ మంత్రి వినోద్ పాల్గొని డిజిటల్ పద్ధతిలో దీనిని ప్రారంభించారు. అనంతరం వివిధ జిల్లాల నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కనెక్ట్ అయిన రైతులతో మంత్రి నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి శంకర్, డైరెక్టర్ మురళీధరన్ లతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు, పెద్ద సంఖ్యలో రైతులు (వర్చువల్ విధానంలో) పాల్గొన్నారు. రైతుల సాగు ఉత్పాదకతను పెంచడానికి, వాతావరణం, రుణాలు, సాంకేతికతపై ఒకే చోట అవగాహన కల్పించడానికి ఈ డిజిటల్ వేదిక ఎంతగానో దోహదపడుతుందని అధికారులు తెలిపారు.


