న్యూస్రీల్
– జస్టిస్ పి.ఎన్. ప్రకాష్
సాక్షి, చైన్నె: యువత అవినీతికి వ్యతిరేకంగా పోరాడాలని హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పీఎన్ ప్రకాష్ పిలుపునిచ్చారు. శ్రీరామచంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ లో శనివారం స్నాతకోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు. డెంటల్, ఫార్మసీ, నర్సింగ్, ఫిజియోథెరపీ, ఇంజినీరింగ్, మేనేజ్మెంట్ తదితర విభాగాలకు చెందిన 421 మంది విద్యార్థులు డిగ్రీ పట్టాలను అందుకున్నారు. మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పి.ఎన్.ప్రకాష్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు.
అవినీతి రహిత భారతం
విద్యార్థులకు డిగ్రీలను ప్రదానం చేసినానంతరం జస్టిస్ పీఎన్ ప్రకాష్ మాట్లాడారు. దేశాభివృద్ధిలో యువత పాత్ర కీలకమని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యధిక యువజన జనాభా కలిగిన దేశాల్లో భారతదేశం ఒకటి అని, యువత అవినీతికి వ్యతిరేకంగా దృఢంగా నిలబడాలని పిలుపునిచ్చారు. కేవలం అకడమిక్ మార్కుల కంటే ఆచరణాత్మక నైపుణ్యాలు వృత్తి పరంగా రాణించడానికి దోహదపడతాయని తెలిపారు. గ్రాడ్యుయేషన్ అనేది నేర్చుకోవడానికి ముగింపు కాదని, నిరంతరం కొత్త విషయాలను నేర్చుకుంటూ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని విద్యార్థులకు సూచించా రు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటం టెక్నాల జీ వంటి ఆధునిక సాంకేతికతలను కేవలం వినియోగదారులుగా మాత్రమే కాకుండా, వాటిలో కొత్త ఆవిష్కరణలు చేసే సృష్టికర్తలుగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆ వర్సిటీ ప్రో–ఛాన్సలర్ ఆర్.వి.సెంగుట్టువన్, ట్రస్టీ సంయుక్త వెంకటాచలం, డీన్ డాక్టర్ హెచ్.తమిళ సెల్వన్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
బస్సు బోల్తా
వేలూరు:తిరువణ్ణామలై నుంచి సుమారు 30 మందికి పైగా ప్రయాణికులతో ప్రభుత్వ బస్సు శనివారం ఉదయం విల్లుపురం బయలు దేరింది. ఈ బస్సులో తిరుచ్చి జిల్లా లాల్కుడి గ్రామానికి చెందిన కనకరాజ్(40) ప్రయాణం చేశాడు. ఇతను సమయపురంలోని ఒక హోటల్లో వంట మాస్టర్గా పనిచేస్తున్నాడు. బస్సు వేట్టవలం వద్ద వెళ్తున్న సమయంలో డ్రైవర్ అదుపు తప్పి బస్సు రోడ్డుపై అటు ఇటు వెల్లి వెల్లి రోడ్డు పక్కన ఉన్న పల్లంలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సు లో ప్రయానం చేసిన కనకరాజ్ అక్కడిక్కడే మృతి చెందగా సుమారు 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీటిని గమనించిన స్థానికులు వెంటనే వేట్టవలం పోలీసులకు సమాచారం అందజేయడంతో పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తిరువణ్ణామలైలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కనకరాజ్ మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం తిరువణ్ణామలై ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. బస్సు డ్రైవర్ నిద్రమత్తులో ఉండడమే ప్రమాదానికి కారణమని ప్రయాణికులు తెలిపారు.


