ఉద్యోగుల కల సాకారం!
న్యూస్రీల్
అమల్లోకి అష్యూర్డ్ పెన్షన్ స్కీమ్
ప్రత్యేక ఉత్తర్వుల జారీ
750 మందికి నియామక ఉత్తర్వులు
మళ్లీ స్టాలినే సీఎం
సర్వేలో స్పష్టమైన మొగ్గు
ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల 20 ఏళ్ల నాటి కలను సాకారం చేస్తూ సీఎం ఎంకే స్టాలిన్ శనివారం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. తమిళనాడు అష్యూర్డ్ పెన్షన్ స్కీమ్ (టీఏపీఎస్– హమీతో కూడిన పెన్షన్ పథకం) ను అమలు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు సీఎంకు కృతజ్ఞతలు తెలియజేశారు.
సాక్షి, చైన్నె: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు గత కొద్ది రోజులుగా తమ పోరాటాలను తీవ్రతరం చేస్తూ వచ్చిన విషయం తెలిసిందే. పాత పెన్షన్ విధానం అమలు, వేతనం, భత్యం పెంపు, ఖాళీల భర్తీ తదితర పది డిమాండ్లతో సాగుతూ వస్తున్న ఈ పోరాటంపై ప్రభుత్వం స్పందించింది. మంత్రుల ఏవీ వేలు, తంగం తెన్నరసు, అన్బిల్మహేశ్లతో కూడిన కమిటీని రంగంలోకి దించింది. చర్చలు సంతృప్తికరంగా లేదంటూ ఈనెల 6న సమ్మె గంట మోగించనున్నామని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ప్రకటించాయి. ఈ పరిస్థితులలో వారికి తీపి కబురుగా 20 ఏళ్ల నాటి కలను, కోరికను సాకారం చేస్తూ ఉత్తర్వులను సీఎం స్టాలిన్ జారీ చేశారు.
ప్రత్యేక ఉత్తర్వులు..
ఉద్యోగులు, ఉపాధ్యాయులకు కొత్త సంవత్సరం, సంక్రాంతి కానుకగా పాత పెన్షన్ విధానం ఫలాలు అమలు చేస్తూ అష్యూర్డ్ పెన్షన్ స్కీమ్ను ప్రకటిస్తూ సీఎం స్టాలిన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు పదవీ విరమణ రోజున ఉద్యోగి పొందే నెల జీతంలో 50 శాతం పెన్షన్గా అందజేయడం జరుగుతుందని ప్రకటించారు. పెన్షన్ దారులకు ఆరు నెలలకు ఓ పర్యాయం ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా భత్యం అందజేయడం జరుగుతుందని వివరించారు. విధి నిర్వహణలో మరణించే వారికి రూ. 25 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. పెన్షనర్ మరణించిన పక్షంలో ఆయన సూచించిన వ్యక్తి(నామిని)కి 60 శాతం కుటుంబ పెన్షన్గా అందజేయడం జరుగుతుందని తెలిపారు. అలాగే మరెన్నో అంశాలను పేర్కొంటూ ఈ ఉత్తర్వులలో ప్రయోజనాలను ఉద్యోగులు, ఉపాధ్యాయులకు వర్తింప చేశారు. ఈ పథకం కోసం రూ. 13 వేల కోట్లను విడుదల చేశారు. ఏటా పెన్షన్ కోసం రూ. 11 వేల కోట్లను కేటాయించే విధంగా ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ ప్రకటన తదుపరి జాక్టో – జియో నేతృత్వంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలందరూ సీఎం స్టాలిన్ను కలిసి స్వీట్లు తినిపించి మరీ తమ కృతజ్ఞతలు తెలియజేశారు. సమ్మె రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఎన్నికల హామీలన్నీ నెరవేర్చామని, ఉద్యోగుల ప్రయోజనాలే ముఖ్యం అని సీఎం స్టాలిన్ ఈసందర్భంగా ట్వీట్ చేశారు.
ఉద్యోగ నియామక ఉత్తర్వులు
మళ్లీ సీఎంగా స్టాలిన్?
రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తూ, ద్రావిడ మోడల్ అంటూ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా పథకాలను అమలు చేస్తున్న సీఎం స్టాలిన్కు మళ్లీ తమిళ ప్రజలు పట్టం కట్టబోతున్నట్టు తాజా సర్వేలో తేలింది. లయోల కళాశాలల పూర్వ విద్యార్థులు జరిపిన సర్వే వివరాలను శనివారం ప్రకటించారు. ఇందులో మళ్లీ సీఎం స్టాలిన్ అని స్పష్టం చేశారు. 2026లో మళ్లీ స్టాలిన్ సీఎం అవుతారా? అన్న ప్రశ్నకు 55 శాతం మంది ఈ సర్వేలో మద్దతు తెలియజేయడం విశేషం. ఇక, సీఎం అభ్యర్థిత్వంలో టీవీకే అధినేత విజయ్ రెండో స్థానం దక్కింది. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి మూడో స్థానంతో సర్దుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. టీవీకే ఆవిర్భావంతో డీఎంకే ఓటు బ్యాంక్కు అఽఽధిక నష్టం ఏర్పడుతుందని ప్రకటించారు. ఆ తదుపరి వీసీకే, అన్నాడీఎంకేకు నష్టం తప్పదని వివరించారు. అన్ని పార్టీల ఓట్లను విజయ్ చీల్చనున్నారని పేర్కొన్నారు. విజయ్కు తాజాగా 40 శాతం మంది మద్దతు ఇవ్వడం విశేషం.
ముందుగా కోట్టూరు పురంలోని అన్నా సెంటెనరీ లైబ్రరీలో తమిళనాడు యూనిఫామ్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు ద్వారా ఎంపికై న 621 మంది సబ్ ఇన్స్పెక్టర్లు, 129 మంది అగ్నిమాపక కేంద్రం అధికారులకు సీఎం స్టాలిన్ ఉద్యోగ నియామక ఉత్తర్వులను అందజేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులు ఎం. సుబ్రమణియన్, శేఖర్బాబు, సీఎస్ మురుగానందం, హోంశాఖ కార్యదర్శి ధీరజ్కుమార్, డీజీపీ వెంకటరామన్, అగ్నిమాపక శాఖ డైరెక్టర్ సీమా అగర్వాల్, చైన్నె పోలీసు కమిషనర్ అరుణ్ హాజరయ్యారు. 621 మందిలో 469 మంది పురుషులు, 152 మంది మహిళలు ఉన్నారు. 129 మంది అగ్నిమాపక శాఖ అధికారులలో 90 మంది పురుషులు, 39 మంది మహిళలు ఉన్నారు. సబ్ ఇన్స్పెక్టర్లకు ఈనెల 5 నుంచి, అగ్నిమాపక అధికారులకు ఈనెల 21 నుంచి శిక్షణ కార్యక్రమాలు జరగనున్నాయి. ఇందులో సీఎం స్టాలిన్ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్రను వివరించారు. విధి నిర్వహణలో బాధ్యతలను, సామాజిక అంశాలను ఈ సందర్భంగా కొత్తగా చేరిన వారికి వివరించారు. తమిళనాడు భవిష్యత్తు లక్ష్యంగా బాధ్యయుతంగా, శక్తి వంచన లేకుండా శ్రమించాలని పిలుపు నిచ్చారు. ప్రజా రక్షణలో రాజీ పడ వద్దు అని సూచించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర స్థాయిలో పట్టు , పత్తి రకాలకు ఉత్తమ చేనేత వీవర్ అవార్డులు, ఉత్తమ డిజైనర్ అవార్డులు, ఉత్తమ యువ డిజైనర్ అవార్డులకు నామినేట్ చేయబడిన 13 మంది అవార్డు గ్రహీతలకు రూ. 23.75 లక్షల చెక్కును, ప్రశంసా పత్రాలను సీఎం స్టాలిన్ అందజేశారు. అలాగే హిందూ మత ధార్మిక దేవాయ శాఖ నేతృత్వంలో రూ. 108 కోట్లతో చేపట్టనున్న 19 పనులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం స్టాలిన్ శంకుస్థాపన చేశారు. అలాగే,రూ. 15.30 కోట్లతో పూర్తి చేసిన 17 పనులను ప్రారంభించారు.
ఉద్యోగుల కల సాకారం!
ఉద్యోగుల కల సాకారం!


