పెట్టుబడుల వరద
మదురై వేదికగా 91 ఒప్పందాలు దక్షిణ తమిళనాడులోకి రూ. 36 వేల కోట్ల పెట్టుబడులు మేలూరులో పారిశ్రామికవాడ మదురై 2044 మాస్టర్ ప్లాన్ను ఆవిష్కరించిన సీఎం రామనాథపురంలో విమానాశ్రయం
దక్షిణ తమిళనాడులో ఆధ్యాత్మిక,
ప్రధాన కేంద్రంగా ఉన్న మదురై వేదికగా ఆదివారం విదేశీ, స్వదేశీ పెట్టుబడుల వరద పారింది. టీఎన్ రైజింగ్ ఇన్వెస్టర్స్ మీట్లో సీఎం ఎంకే స్టాలిన్ సమక్షంలో 91 ఒప్పందాలు జరిగాయి. రూ. 36,660 కోట్ల పెట్టుబడిని దక్షిణ తమిళనాడులోని వివిధ పారిశ్రామిక వాడలలో పెట్టేందుకు స్వదేశీ, విదేశీ సంస్థలు ముందడుగు వేశాయి. తద్వారా 56,766 మందికి ఉపాధి లభించనుంది.
సాక్షి, చైన్నె: తమిళనాడు పరిశ్రమలు, పెట్టుబడి ప్రమోషన్, వాణిజ్య శాఖ నేతృత్వంలో మదురైలో ఆదివారం పెట్టుబడి దారుల మీట్ జరిగింది. ఇందులో పరిశ్రమల శాఖ ద్వారా 52,060 మందికి ఉపాది కల్పన దిశగా రూ. 35,560.15 కోట్ల పెట్టుబడి పెట్టే విధంగా పెట్టేందుకు 46 ఒప్పందాలు జరిగాయి. అలాగే, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ద్వారా 1,100 కోట్లతో 4,706 మందికి ఉపాధి కల్పన దిశగా మరో 45 అవగాహన ఒప్పందాలు జరిగాయి. ఇందులో తైవాన్కు చెందిన పీ హై గ్రూప్ తోలు ఉత్పత్తులు, పాదరక్షల తయారీ ప్రాజెక్టు, హ్యుందాయ్ కంపెనీ ద్వారా నౌకల తయారీ పరిశ్రమ, ఎస్ఎఫ్ఓ టెక్నాలజీ ఎలక్ట్రానిక్ విడిభాగాల ఉత్పత్తి పరిశ్రమ, రిలయన్స్ ఇండస్ట్రీస్ – బయో ఎనర్జీలు అతిపెద్ద ఒప్పందాలుగా జాబితాలో ఉన్నాయి. ఈ సందర్భంగా మేలూరులో 278.26 కోట్లతో పారిశ్రామిక వాడపనులకు సీఎం స్టాలిన్ శంకుస్థాపన చేశారు.అలాగే, మధురై సమగ్ర ప్రగతిని కాంక్షిస్తూ మధురై మాస్టర్ ప్లాన్ 2044ను ఆవిష్కరించారు. 42 లక్షల మందితో కూడిన ఈనగరం అభివృద్ధి లక్ష్యంగా డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ (డీటీసీపీ) రూపకల్పన చేశారు. అంతే కాకుండా తమిళనాడు బొమ్మల ఉత్పత్తి పాలసీ– 2025 విడుదల చేశారు.అధిక–నాణ్యత స్థిరమైన బొమ్మల ఉత్పత్తిలో తమిళనాడును ఒక ప్రముఖ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తంజావూరు, అంబా సముద్రం తదితర ప్రాంతాలలోని చేతి వృత్తికళాకారులకు తోడ్పాటును అందించేందుకు నిర్ణయించారు. పరిశ్రమ, పరిశోధన, విద్యా సంస్థలసహకారం లక్షయంగా ’తమిళనాడు ప్రభుత్వ విశ్వవిద్యాలయ పరిశోధనా ఉద్యానవనం ట్రస్ట్ ను మధురై కామరాజ్ విశ్వవిద్యాలయంతో అనుసంధానిస్తూ, వినూత్న పరిశోధన ప్రాజెక్టులకు రూ. 2.25 కోట్ల ఆర్థిక సాయం అందజేశారు. రైతుల జీవనోపాధిని మెరుగు పరచడం, వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ దిశగా భారత వ్యవసాయ పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో మైసూర్లో పనిచేస్తున్న తొమ్మిది ప్రధాన జాతీయ సంస్థలతో ఈసందర్భంగా అవగాహన ఒప్పందాలు కూడా జరిగాయి. ఇక, ఐదు పారిశ్రామిక సంస్థలలో ఉద్యోగాలను దక్కించుకున్న వారికి నియామక ఉత్తర్వులను సీఎం అందజేశారు.
దక్షిణ జిల్లాల ప్రగతే లక్ష్యం
ఈ మీట్లో సీఎం స్టాలిన్ ప్రసంగిస్తూ, అధికార పగ్గా లు చేపట్టిన సమయంలో బలహీనంగా ఉన్న తమిళ నాడు ఆర్థిక వ్యవస్థను తాజాగా ఉన్నత స్థానానికి చే ర్చుతున్నామని వివరించారు. తన విదేశీ పర్యటనల గురించి ప్రస్తావిస్తూ, తనపై నమ్మకంతో విదేశీ పెట్టు బడులు ఇక్కడకు విస్తృతంగా వస్తున్నాయని పేర్కొన్నారు. తమిళనాడు అభివృద్ధి ప్రయాణంలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం కీలకం అని పేర్కొంటూ, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు సమతుల్య అభివృద్ధి దిశగా విస్తృత ప్రణాళికలతో ముందుకెళ్తున్నామని ప్రకటించారు. పెట్టుబడులు అంత సులువుగా రావు అని పే ర్కొంటూ, పెట్టుబడులు పెట్టే ముందు, రాష్ట్రం విధా నాలు ఏమిటి? మానవ వనరులు, మౌలిక సదుపా యాలు, చట్టం క్రమశిక్షణ, నిర్వహణ నైపుణ్యాలు, దీర్ఘకాలిక స్థిరత్వం వంటి వాటిని పరిశీలించి పారిశ్రామిక వేత్తలు అడుగు పెడుతున్నారన్నారు. అందుకే తమిళనాడును అన్ని విధాలుగా పారిశ్రామిక వేత్తలకు నచ్చే విధంగా తీర్చిదిద్దుతూ, తాజాగా వైగై నది తీరం, మీనాక్షి అమ్మన్ వైభవం, మధురై మల్లి సువాసన, కీలడి నాగరికత నిండిన దక్షిణ తమిళనాడులో ప్రధాన కేంద్రం మధురై వేదిగా పారిశ్రామక ప్రగతి ఒప్పందాలు జరిగాయని వివరించారు. ఇక్కడి పారిశ్రామక వాడలను గుర్తుచేస్తూ, మదురైలో రూ. 314 కోట్లతో టైడల్ పార్క్, మదురై, శివగంగలలో నియో పార్క్, విరుదునగర్, తిరునల్వేలి, కన్యాకుమారి లో టైడల్ ని యో పార్కులకు ఏర్పాటు, రామనాథపురంలో విమానాశ్రయం నిర్మాణానికి ప్రయత్నాలు చేస్తున్నామని ప్రకటించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు కేఎన్ నెహ్రు, ఏవి వేలు, కేఆర్ పెరియకరుప్పన్, ఆర్ఎస్ రాజకన్నప్పన్, పి. మూర్తి, పళనివేల్ త్యాగరాజన్, టి.ఆర్.బీ. రాజా, ఎంపీ ఎస్ వెంకటేషన్,పరిశ్రమలు, వ్యవసాయం తదితర శాఖల అధికారులతో పాటుగా మదురై జిల్లా అధికారులు, వివిధ పారిశ్రామిక సంస్థల అధినేతలు, ప్రతినిధులు హాజరయ్యారు.
సంక్షేమ పథకాలు
ఈ మీట్ను ముగించుకుని మదురై జిల్లా ఉత్తంగుడిలోని కలైంజ్ఞర్ తిడల్(మైదానం)లో జరిగిన ప్రభుత్వ కార్యక్రమానికి సీఎం హాజరయ్యారు. రూ. 3,065.49 కోట్ల వ్యయంతో పూర్తి చేసిన 63 పనులను ప్రారంభించారు. అలాగే, ఏడు కొత్త పనులకు శంకుస్థాపన చేశారు. 1,77,562 మంది లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందజేశారు. ఇందులో 3,400 మంది లబ్ధిదారులకు ఇంటి పట్టాలు, 1,376 మంది లబ్ధిదారులకు భూమి పట్టాలను పంపిణీ చేశారు. మహిళా ఆటో డ్రైవర్లను , ట్రాన్స్ జెండర్లను ప్రోత్సహించే విధంగా 260 మందికి ఈ– ఆటోలను అందజేశారు. 712 మంది రైతులకు రుణాలనుఅ ందజేశారు. 735 మంది దివ్యాంగులకు బ్యాటరీతో నడిచే, మూడు చక్రాల వాహనాలు, పెట్రోల్ తో నడిచే స్కూటర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఎం ప్రసంగిస్తూ, మధురై మెట్రోరైలుప్రాజెక్టును సాధించి తీరుతామని ఽప్రకటించారు. అలాగే, వైగై నదీ ఉత్తర వైపున విరగనూరు రోడ్డును రూ. 130 కోట్లతో 8.4కి.మీ దూరం ఏర్పాటు చేయనున్నామని , మీనాక్షి అమ్మవారి ఆలయం చుట్టూ ఉన్న నాలుగు ప్రధాన వీధులు, ఇతర వీధులు, పుత్తూరు, అన్నానగర్, మార్కెట్ పేట, సౌత్ గేట్,ఎస్ఎస్ కాలనీ, ఆర పాళయం, అరసరడి, పలగానత్తం, బైకార పరిసరాలలో మురుకు నటి పైప్లను తొలగించి,కొత్త ప్రాజెక్టుకు ప్రణాళిక సిద్ధం చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. ఉత్తంకుడిలో వరదల నివారణకు రూ. 7 కోట్లతో రిటైనింగ్ వాల్, మేలూరు కేశం పట్టిలో అరువి రిజరాయ్వర్ పనరుద్దరణ, సూరపట్టిలో కొత్త చెక్ డ్యాం నిర్మాణం, మేలమత్తూరు, పుదుక్కుళం, విలాచేరిలలో రూ. 10 కోట్లతో చెరువుల అభివృద్ధి, సత్తయ్యర్, అలంగానల్లూరు,వాడి పట్టి రోడ్డు నిర్మాణం వంటి హామీలను ప్రకటించారు. తిరుప్పర కుండ్రం దీపం వివాదాన్ని గుర్తు చేస్తూ, ఇది ఆధ్యాత్మికత కాదని, రాజకీయం, కుట్ర, చౌక బారు వ్యవహారం అంటూ బీజేపీ పై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆధ్యాత్మికత అంటే మనశ్శాంతిని, ప్రశాంతతను కల్గించడం, నలుగురికి మంచి చేయడమేనని వ్యాఖ్యలు చేశారు.ఆధ్యాత్మికత, ప్రశాంతతకు నిలయంగా ఉన్న మదురైలో అభివృద్ధిని అడ్డుకునేందుకు ఈ అంశాన్ని తెర మీదకు తెచ్చి రాద్దాంతం సృష్టించారని మండి పడ్డారు. ఈ కార్యక్రమానికి మంత్రులు కేకేఎస్ఎస్ఆర్ రామచంద్రన్, తంగం తెన్నరసులతో పాటుగా పైన పేర్కొన్న ఇతర మంత్రులు, మధురై జిల్లా కలెక్టర్ కేజే ప్రవీణ్కుమార్లు హాజరయ్యారు. ముందుగా పందల్కుడి వద్ద రూ. 69.21 కోట్లతో జరుగుతున్న కాలువ నిర్మాణ పనులను సీఎం పరిశీలించారు.
వీరనారికి గౌరవం
మధురైలోని మేలమడై జంక్షన్ వద్ద రూ. 150 కోట్ల వ్యయంతో నాలుగు లేన్లతో బ్రహ్మాండ వంతెనను నిర్మించారు. మదురై తొండి రోడ్ రాష్ట్ర రహదారి, శివగంగ రోడ్డు, మదురై సర్యులర్ రోడ్డులను అనుసంధానించే విధంగా మేలమడై జంక్షన్, ఆవిన్ జంక్షన్ , జిల్లా కలెక్టర్ కార్యాలయం జంక్షన్లను కలుపుతూ బ్రహ్మాండంగా రూపుదిద్దుకున్న ఈ వంతెనను సీఎం స్టాలిన్ మధురై ప్రజలకు అంకితం చేశారు. వీర నారి వేలునాచ్చియార్ వంతెనగా దీనికి నామకరణం చేశారు.


