
వంద కోట్లతో మాక్సివిజన్
●10 చోట్ల కంటి వైద్య ఆస్పత్రులు ●ప్రారంభించిన క్రికెటర్ ఎంఎస్ ధోని
సాక్షి, చైన్నె: మాక్సివిజన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ చైన్నెలో రూ.100 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు నిర్ణయించింది. చైన్నె అంతటా 10 సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్స్, విజన్ సెంటర్లను ప్రారంభించేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా తొలి ఆస్పత్రిని భారత మాజీ క్రికెటర్, చైన్నె సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాక్సివిజన్ ఐ హాస్పిటల్స్ గ్రూప్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జీఎస్కే వేలు, మాక్సివిజన్ ఐ హాస్పిటల్స్ గ్రూప్ కో–చైర్మన్ డాక్టర్ కాసు ప్రసాద్రెడ్డి పాల్గొన్నారు. చైన్నెలోని మాక్సివిజన్ ఐ హాస్పిటల్స్ క్లినికల్–అకడమిక్ డైరెక్టర్ డాక్టర్ బి.గణేష్, తమిళనాడులోని మిగిలిన ప్రాంతాలకు ప్రాంతీయ క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ శిబు వర్కీ కూడా ఈ కార్యక్రమానికి హజరయ్యారు. డాక్టర్ జీఎస్కే వేలు మాట్లాడుతూ చాలా కాలంగా మాక్సివిజన్ కార్పొరేట్ ప్రధాన కార్యాలయం ఉన్న చైన్నెకి రావాలని ఎదురు చూశామని, ఇప్పుడు అది సాకారమైందన్నారు. మాక్సివిజన్ చైన్నె, తమిళనాడులో కంటి సంరక్షణ సేవలను విస్తృతం చేయనున్నట్టు వివరించారు. మాక్సివిజన్ ఐ హాస్పిటల్స్ క్లినికల్–అకడమిక్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ బి.గణేష్ మాట్లాడుతూ చైన్నె అంతటా 10 సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్స్ ప్రారంభించామన్నారు. గ్రేటర్ చైన్నె ప్రాంతంలోని ప్రతి మూలకు ప్రపంచ స్థాయి కంటి సంరక్షణను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నామన్నారు. చైన్నె సూపర్ కింగ్స్ కెప్టెన్, టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మాట్లాడుతూ చైన్నె అంతటా ఈ కేంద్రాలను ప్రారంభించడం ద్వారా చైన్నెలో కంటి వైద్య సేవల మాక్సివిజన్ ప్రయాణంలో తానూ భాగం కావడం ఆనందంగా ఉందన్నారు. విజన్ అనేది మనం తరచుగా తేలికగా తీసుకునే విషయమని, మాక్సివిజన్లో అన్ని రకాల సేవలు సరసమైన ధరలకు అందుబాటులో ఉండడాన్ని అభినందిస్తున్నట్టు పేర్కొన్నారు. చైన్నె ప్రజలకు ప్రయోజనం చేకూర్చేలా, తనకు ఇష్టమైన చైన్నె నగరంలో పది కేంద్రాల ఏర్పాటు సంతోకరమని పేర్కొన్నారు.