దయచేసి తనను యువ కామరాజ్
వంటి పేరుతో పిలవొద్దు అని
విద్యార్థులకు తమిళగ వెట్రి కళగం
అధ్యక్షుడు, నటుడు విజయ్ విన్నవించారు. విద్యా కార్యక్రమాల్లో రాజకీయ
ప్రసంగాలు వద్దని వేడుకుంటూ, శుక్రవారం జరిగిన కార్యక్రమంలో
ఆ ప్రసంగాలపై పూర్తిగా నిషేధం విధించారు.
సాక్షి, చైన్నె: తమిళగ వెట్రి కళగం నేతృత్వంలో పది, ప్లస్టూ పరీక్షల్లో నియోజక వర్గాల వారీగా టాపర్లను ఎంపిక చేసి సత్కరిస్తున్న విషయం తెలిసిందే. రెండు విడతల కార్యక్రమాలు విజయవంతంగా ముగియగా, మూడో విడతగా 51 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన విద్యార్థులను చైన్నెకి పిలిపించారు. వీరికి సర్టిఫికెట్లు, విద్యాపరంగా ప్రోత్సాహంజ్ఞాపికలను విజయ్ శుక్రవారం మహాబలిపురం సమీపంలోని ఓ రిసార్టులో అందజేశారు. కార్యక్రమానికి హాజరైన విజయ్ ముందుగా అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనను గుర్తు చేస్తూ ప్రసంగించారు. ఈ ఘటన చూస్తుంటే కన్నీళ్లు ఆగడం లేదని, తీవ్ర వేదనతో ఉన్నట్టు పేర్కొంటూ, ఈ ఘటనలో మరణించిన వారందరికి నివాళులర్పించే విధంగా అందరూ మౌనం పాటించారు. అనంతరం విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఈసందర్భంగా సత్కరించారు.
రాజకీయాలు వద్దు
కోయంబత్తూరుకు చెందిన కార్తిక్ అనే విద్యార్థికి ఉంగరం బహూకరించారు. ఈసందర్భంగా విద్యార్థులు ప్రసంగిస్తూ విజయ్ను సీఎంగా చూడాలనుకుంటున్నామంటూ రాజకీయ వ్యాఖ్యలను అందుకున్నారు. కర్మయోగి కామరాజర్తో పాటు విద్యారంగానికి కృషిచేసిన వారితో విజయ్ను పోల్చుతూ మాట్లాడారు.
ఆసమయంలో మైక్ అందుకున్న విజయ్ దయచేసి ఆ పేర్లతో తనను పిలవొద్దని, వారంతా మహానుభావులు అని, వారితో తనను పోల్చవద్దు అని విన్నవించారు. ఈ వేదికపై రాజకీయ ప్రసంగాలు నిషేదం అని ప్రకటించారు. విద్యార్థులు వారి అనుభవాలను, పాఠశాలలో నచ్చిన ఉపాధ్యాయుల గురించి ప్రస్తావించాలని సూచించడం గమనార్హం. అనంతరం ప్రసంగించిన విద్యార్థిని సమృత తాను బాగా చదవి న్యాయమూర్తి అయిన తర్వాత వచ్చి విజయ్ను కలుస్తానని వ్యాఖ్యానించారు. ఈసందర్భంగా పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొంటూ, ఎన్ని విమర్శలు ఎదురైనా, వంద సమీక్షలు వచ్చినా, ఈ వేదికను వదలుకోవద్దని, 2026లో ఈ కార్యక్రమాన్ని ఒక పండుగగా జరుపుకునే విధంగా ఏర్పాట్లు చేయాలని సూచించడం గమనార్హం. పార్టీ నేతలు భుస్సీ ఆనంద్, ఆదవ్ అర్జున్ పాల్గొన్నారు.
విద్యార్థులకు విజయ్ వేడుకోలు
రాజకీయ ప్రసంగాలకు నిషేధం
విద్యార్థులకు ప్రోత్సాహకాలు