
ఎంపీలకు పళణి ఆశీస్సులు
అన్నాడీఎంకే తరఫున రాజ్యసభకు ఎంపికై న మాజీ ఎమ్మెల్యే, న్యాయవాది ఇన్బదురై, చెంగల్పట్టు జిల్లాకు చెందిన నేత ధనపాల్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడపాడి కె.పళణిస్వామి ఆశీస్సులు అందుకున్నారు. సేలంలోని ఆయన నివాసానికి వెళ్లి తాము అందుకున్న రాజ్యసభ ఎంపిక ధ్రువీకరణ పత్రాలను
అందజేశారు. – సేలం
రాష్ట్రానికి చెందిన ఆరుగురు రాజ్యసభ సభ్యుల పదవీ కాలం జూలైలో ముగియనున్న విషయం తెలిసిందే. ఈ పదవుల భర్తీ నిమిత్తం ఎన్నికల నగారా మోగింది. ఈ ప్రక్రియ గురువారం సాయంత్రంతో ముగిసింది. డీఎంకే తరఫున సీనియర్ న్యాయవాది విల్సన్కు మళ్లీ రాజ్యసభ ఎంపిక కాగా, తొలి సారిగా సేలంకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఎస్ఆర్ శివలింగం, మహిళా రచయిత సల్మా రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎంపిక య్యారు. కూటమి ధర్మం మేరకు డీఎంకే ఇచ్చిన అవకాశంతో మక్కల్ నీది మయ్యం నేత కమలహాసన్ రాజ్యసభకు ఎంపికయ్యారు. ఎమ్మెల్యేల సంఖ్యా బలం మేరకు మిగిలిన రెండు స్థానాలకు అన్నాడీఎంకేకు అవకాశం వచ్చింది. పలువురు సీనియర్లు సీటు కోసం పోటీ పడ్డా, చివరకు సామాన్యులకే పదవులు అన్నట్టుగా పళణిస్వామి నిర్ణయం తీసుకున్నారు. పార్టీ తరఫున పలు కేసుల్లో వాదిస్తూ వచ్చిన న్యాయవాది ఇన్బదురైకు అవకాశం కల్పించారు. ఈయన తిరునల్వేలి జిల్లా రాధాపురం నియోజకవర్గంలో 2016లో గెలిచారు. 2021లో ఓటమి పాలయ్యారు. పార్టీ తరఫున ముఖ్య కేసులను హైకోర్టు, సుప్రీంకోర్టులలో వాదిస్తూ వచ్చిన ఆయనకు తాజాగా పళణిస్వామి ఇచ్చిన అవకాశంతో రాజ్యసభలో అడుగు పెట్టేందుకు సిద్ధమయ్యారు. చెంగల్పట్టు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే, జిల్లాలో ముఖ్య నేతగా ఉన్న ఎం.ధనపాల్కు సైతం అవకాశం ఇచ్చారు. ఈ ఇద్దరు ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. దీంతో తాము అందుకున్న రాజ్యసభ ఎంపిక ధ్రువీకరణ పత్రాలతో చైన్నె నుంచి శుక్రవారం సేలంకు ఆ ఇద్దరూ వచ్చారు. ఎడపాడిలోని నివాసంలో పళణిస్వామిని కలిసి ఆశీస్సులు అందుకున్నారు. తాము అందుకున్న ధ్రువీకరణ పత్రాలను పళణి స్వామికి అందజేసి, ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆ ఇద్దర్ని పళణిస్వామి అభినందించారు. పార్టీ తరఫున రాజ్యసభలో గళం జ్వలింప చేయాలని ఆదేశించారు. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీ ఆదేశాలకు అనుగుణంగా రాజ్యసభలో తమ పనితీరు ఉంటుందని కొత్తగా ఎంపికై న ఆ ఇద్దరు వ్యాఖ్యానించారు.
ధ్రువీకరణ పత్రాల సమర్పణ