
ఊపిరి ఉన్నంత కాలం నేనే అధ్యక్షుడ్ని!
సాక్షి, చైన్నె: ఊపిరి ఉన్నంత వరకు పీఎంకేకు తానే అధ్యక్షుడినని రాందాసు స్పష్టం చేశారు. 2026 తర్వాత ఈ పదవిని అన్బుమణికి అప్పగించాలని నిర్ణయించినా, పార్టీలో 100కు 99 శాతం మంది వ్యతిరేకించడంతో చివరకు ఈ నిర్ణయానికి తాను వచ్చినట్టు ప్రకటించారు. పీఎంకేలో అధికార సమరం ముదిరి పాకాన పడింది. తండ్రి రాందాసు ఓ వైపు, తనయుడు అన్బుమణి మరో వైపు తానంటే తామే అధ్యక్షులమని ప్రకటించుకుంటూ కేడర్లో తీవ్ర గందరగోళాన్ని సృష్టించి ఉన్నారు. అదే సమయంలో ఈ ఇద్దరు పోటాపోటీగా సర్వసభ్య సమావేశం నిర్వహణ కసరత్తులలో ఉండడంతో పీఎంకే రెండు ముక్కలయ్యేనా అనే చర్చ ఊపందుకుంది. జూలైలో పాదయాత్రకు, తన మద్దతు జిల్లాల కార్యదర్శులతో భేటీకి సైతం అన్బుమణి సిద్ధం కావడం గమనార్హంఅదే సమయంలో అన్బుమణితో సయోధ్య డ్రాగా ముగిసిందని స్వయంగా రాందాసు గురువారం ప్రకటించారు. 2026 అసెంబ్లీ ఎన్నికల వరకు తానే అధ్యక్షుడిగా ఉంటానని స్పష్టం చేశారు. అయితే, శుక్రవారం మనస్సు మార్చుకున్నారు. ఊపిరి ఉన్నంత కాలం పీఎంకేకు తానే అధ్యక్షుడ్ని అని ప్రకటించారు. తైలాపురం గెస్ట్హౌస్లో మీడియాతో శుక్రవారం రాందాసు మాట్లాడుతూ 2026 అసెంబ్లీ ఎన్నికల అనంతరం అధ్యక్ష పదవిని అన్బుమణికి కట్టబెట్టాలన్న నిర్ణయంతో ముందుగా తాను ఉన్నానని గుర్తుచేశారు. అయితే, అన్బుమణి చర్యలు, జరుగుతున్న పరిణామాలను చూస్తే, పార్టీ ఏమవుతుందో అనే ఆందోళన తప్పడం లేదన్నారు. అన్బుమణిని అధ్యక్షుడిగా నియమించేందుకు 100లో 99 శాతం మంది తీవ్రంగా వ్యతిరేకించారని వివరించారు. అందుకే తన ఊపిరి, చివరి శ్వాస ఉన్నంత కాలం పీఎంకేకు తానే అధ్యక్షుడినని స్పష్టం చేశారు. ఇక రాష్ట్ర కార్యవర్గంతోపాటు మరి కొందరు జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులను తొలగించే దిశగా రాందాసు కసరత్తులు చేస్తున్నట్టు, ఈ జాబితా ఒకటి రెండు రోజుల్లో వెలువడే అవకాశం ఉందనే సమాచారం వెలువడింది.