క్లుప్తంగా
ఆర్కేపేటలో
గాలీవాన బీభత్సం
తిరుత్తణి: ఆర్కేపేట పేట ప్రాంతంలో గురువారం గాలీవాన బీభత్సం సృష్టించడంతో విద్యుత్ స్తంభాలు కూలి విద్యుత్కు అంతరాయం చోటుచేసుకుంది. అగ్నినక్షత్రం ముగియడంతో ఎండల తీవ్రత కాస్తా తగ్గుముఖం పట్టింది. ఈ క్రమంలో గురువారం సాయంత్రం ఆర్కేపేట పరిసర ప్రాంతాల్లో గాలీవాన బీభత్సం సృష్టించి గంటపాటు కుమ్మరించిన వానకు అమ్మయార్కుప్పంలో నాలుగు ప్రాంతాల్లో విద్యుత్స్తంభాలు కూలడంతో పాటు పలు ప్రాంతాల్లో విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. దీంతో విద్యుత్కు అంతరాయం చోటుచేసుకుంది. వెంటనే విద్యుత్శాఖ సిబ్బంది విద్యుత్సేవలు నియంత్రించి కూలిన విద్యుత్తీగలు తొలగించి కూలిన స్తంభాల ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేసి విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకుంటున్నారు.
అన్నాడీఎంకే బలోపేతానికి కృషి
పళ్లిపట్టు: పళ్లిపట్టు మండలంలో అన్నాడీఎంకే బలోపేతానికి కార్యకర్తలు కృషిచేయాలని మాజీ మంత్రి బీవీరమణ పిలుపునిచ్చారు. పళ్లిపట్టు యూనియన్ అన్నాడీఎంకే ఆధ్వర్యంలో యూనియన్ కార్యదర్శి టీడీ.శ్రీనివాసన్ అధ్యక్షతన అత్తిమాంజేరిపేట, కొళత్తూరు గ్రామాల్లో పార్టీ సభ్యత్వ నమోదు శిబిరాలు గురువారం నిర్వహించారు. ఇందులో ఆ పార్టీ తిరువళ్లూరు వెస్ట్ జిల్లా కార్యదర్శి, మాజీ మంత్రి రమణ పాల్గొని సభ్యత్వ నమోదు ప్రారంభించి మాట్లాడారు. పళ్లిపట్టు మండలం అన్నాడీఎంకేకు పట్టుకొమ్మలాంటిదని, కార్యకర్తలు కలిసికట్టుగా కృషిచేసి అధికసంఖ్యలో యువతీ, యువకులను సభ్యులుగా చేర్పించాలని పిలుపునిచ్చారు. శిబిరంలో పార్టీ మండల శ్రేణులు జంగాళపల్లె చంద్రబాబు, జయవేలు, తిరుత్తణి త్యాగరాజన్ పాల్గొన్నారు.