ప్రేమోన్మాది ఘాతుకం

ధారణి(ఫైల్‌), గణేషన్‌  - Sakshi

సాక్షి, తమిళనాడు: ప్రేమోన్మాది ఘాతుకానికి ఓ ప్రియురాలు బలైంది. ఆమె గొంతు కోసి కిరాతకంగా ప్రియుడు హతమార్చాడు. విక్రవాండిలో ఈ ఘటన శుక్రవారం ఉదయం కలకలం రేపింది. విల్లుపురం జిల్లా విక్రవాండి రాధాపురానికి చెందిన సుదన్‌ కూలీ. ఆయన కుమార్తె ధారణి(19) విల్లుపురం కేకే రోడ్డులోని కళాశాలలో నర్సింగ్‌ డిప్లొమో చదువుతోంది. మరుదం బాక్కంకు చెందిన వరదరాజన్‌కుమారుడు గణేషన్‌(25) సంగీత కార్యక్రమాలలో డ్రమ్స్‌ కళాకారుడు. రాధాపురంలో జరిగిన ఓ సంగీత కార్యక్రమలో ధారణిని చూసి ప్రేమలో పడ్డాడు. ఇతడి ప్రేమను ధారణి అంగీకరించడంతో రెండేళ్లుగా ఇద్దరు చెట్టా పట్ట్టాల్‌ వేసుకుని తిరిగారు.

దూరం పెట్టడంతో ఉన్మాదిగా...
మూడు నెలలుగా గణేషన్‌ను ధారణి దూరం పెట్టింది. ఈ విషయంగా ఆమెను నిలదీశాడు. సంగీత బృందంలోని మరోయువతితో గణేషన్‌ సన్నిహితంగా ఉండడమే ఇందుకు కారణంగా తేలింది. ఆమె కేవలం తన బృందంలో ఓ సభ్యురాలు మాత్రమేనని నచ్చచెప్పినా ధారణి వినిపించుకోలేదు. దీంతో తరచూ ఈ ఇద్దరి మధ్య వాగ్వివాదాలు చోటు చేసుకుంటూ వచ్చాయి. తనను పూర్తిగా ధారణి దూరం పెట్టడంతో గణేషన్‌ ఉన్మాదిగా మారాడు. శుక్రవారం ఉదయాన్నే నేరుగా ఆమె ఇంటి వద్దకే వెళ్లాడు. ఇంట్లో ఎవరూలేకపోవడం అతడికి కలిసి వచ్చినట్టైంది. ఆమెతో గొడవ పడ్డాడు.

నచ్చచెప్పే ప్రయత్నం చేశాడు. ఆమె అంగీకరించకపోవడంతో కత్తితో గొంతు కోసి చంపేశాడు. అదే సమయంలో ఆ యువతి బంధువు ఒకరు ఇంట్లోకి రావడం, ఈ దృశ్యాన్ని చూసి కేకలు పెట్టడంతో గణేషన్‌ ఉడాయించాడు. అతడిని పట్టుకునేందుకు గ్రామస్తులు వెంట బడ్డా ఫలితం లేదు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. కేసు నమోదు చేసి గణేషన్‌ కోసం గాలించారు. అదేప్రాంతంలో ఓ చోట తలదాచుకుని ఉన్న అతడిని అరెస్టు చేసి విచారిస్తున్నారు.

Read latest Tamil Nadu News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top