సూర్యాపేట అర్బన్ : రాజకీయ బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి అన్నారు. కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్పై ఈడీ దాడులకు వ్యతిరేకంగా గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని నల్లబావి సెంటర్లో సీపీఎం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగబద్ధ సంస్థలను అడ్డుపెట్టుకుని సీపీఎం నాయకత్వాన్ని బలహీనపరచలేరని అన్నారు. కేరళలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ, కాంగ్రెస్ కలిసి మాజీ సీఎం విజయన్పై ఈడీని అడ్డు పెట్టుకుని దాడులు చేయడం ప్రజాస్వామ్యాన్ని కించపరచడమేనని అన్నారు. ప్రస్తుత పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి లక్షల కోట్ల రూపాయల కుంభకోణం చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు నెమ్మాది వెంకటేశ్వర్లు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు, కోట గోపి జిల్లా కమిటీ సభ్యులు ఏలుగురి గోవింద్, మేకనబోయిన శేఖర్ రూరల్ మండల కార్యదర్శి మేరెడ్డి కృష్ణారెడ్డి, సూర్యాపేట 3 టౌన్ కార్యదర్శి చిట్లింకి యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
ఫ సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి


