మఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో మంగళవారం స్వామివారి కల్యాణాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, గర్భాలయంలోని మూలవిరాట్కు పంచామృతాభిషేకం చేపట్టారు. అనంతరం స్వామి, అమ్మవార్లలను పట్టు వస్త్రాలతో వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవ సంవాదం నిర్వహించారు. కల్యాణ వేడుకలో భాగంగా విశ్వక్సేనపూజ, పుణ్యహవచనం, రక్షాబంధనం, రుత్వి గ్వరణం, మధుఫర్కపూజ, మాంగల్యధారణ, తలంబ్రాలతో వైభవంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్లను గరుడ వాహనంపై ఆలయ తిరుమాడ వీధులలో ఊరేగింపు నిర్వహించారు. ఆంజనేయ స్వామికి నాగవల్లి దళా లతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు, ఈఓ, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.
31న బ్యాడ్మింటన్
జిల్లా జట్టు ఎంపిక
కోదాడరూరల్ : వచ్చేనెలలో హైదరాబాద్, మిర్యాలగూడలో జరగనున్న రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ పోటీలకు అండర్–19 బాలబాలికల, సీనియర్స్ సీ్త్ర, పురుషుల విభాగంలో జిల్లా జట్టుకు ఈ నెల 31న క్రీడాకారుల ఎంపిక నిర్వహించనున్నట్లు బ్యాడ్మింటన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ రామారావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కోదాడ పట్టణంలోని ఈఆర్ఎస్ ఇండోర్ స్టేడియంలో ఉదయం 10 గంటల నుంచి ఎంపిక పోటీలు ప్రారంభం అవుతాయని, ఆసక్తి గల క్రీడాకారులు తమ పేర్లను నమోదు చేయించుకోవాలని సూచించారు. జిల్లా వాసులకే పోటీల్లో పాల్గొనే అవకాశం ఉంటుందని తెలిపారు. వివరాలకు సెల్ : 9059068263, 96421 14372 నంబర్లను సంప్రదించాలని కోరారు.
బాల్య వివాహాలు అరికట్టాలి
పెన్పహాడ్ : బాల్యవివాహాలు అరికట్టి బాలికల భవిష్యత్తుకు బాటలు వేయాలని సీడీపీఓ సుబ్బలక్ష్మి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని సింగారెడ్డిపాలెం, మాచారం గ్రామాలలో మహిళా వారోత్సవాలో భాగంగా నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. బాల్య వివాహాల నివారణపై గ్రామ ప్రజలకు, కిశోర బాలికలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సర్పంచ్లు ఒగ్గు కిరణ్, ఇటికాల శ్రీనివాస్, ఏపీఎం అంజయ్య, ఎల్సీపీఓ నాగరాజు, ఐసీడీఎస్ సూపర్వైజర్లు హనీఫా, స్వప్న, పంచాయతీ కార్యదర్శి అఖిల్, సోషల్ వర్కర్ శ్రీలక్ష్మి, జండర్ స్పెషలిస్ట్ రేవతి, ఎయిడ్ సంస్థ జిల్లా కోఆర్డినేటర్ ఒగ్గు సోమన్న, కిరణ్, సీసీ వెంకన్న పాల్గొన్నారు.
అర్వపల్లిలో
ఈదురు గాలుల బీభత్సం
అర్వపల్లి: జాజిరెడ్డిగూడెం మండలంలోని అర్వపల్లితో పాటు పలు గ్రామాల్లో మంగళవారం సాయంత్రం భారీ ఈదురు గాలులు వీచాయి. కొద్దిపాటి వర్షపు జల్లులు కురిశాయి. ఈదురు గాలుల ధాటికి పలు ఇళ్ల రేకులు గాలికి లేచిపోయాయి. దుకాణాల ఎదుట బోర్డులు ఊడిపడ్డాయి. కొనుగోలు కేంద్రాలలో ధాన్యం రాశులపై కప్పిన టార్పాలిన్లు ఎగిపోగా జల్లులకు ధాన్యం కొంత మేరకు తడిసింది.


