నడిగూడెం : నడిగూడెం, మునగాల మండలాల పరిఽధిలో నాడు నాగార్జున సాగర్ ఎడమ కాల్వ తవ్వకంలో భాగంగా రెండు చోట్ల నిర్మించిన డీప్కట్లలో ఏడాది పొడవునా నీరుండి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. మునగాల మండలం నారాయణగూడెం నుంచి కృష్ణానగర్ వరకు దాదాపు నాలుగు కిలోమీటర్లు, సిరిపురం వద్ద దాదాపు రెండు కిలోమీటర్ల దూరం వరకు ఈ డీప్కట్లు నిర్మించారు. కాల్వ తవ్వేటప్పుడు భూమి సహజమైన లెవెల్ కంటే చాలా లోతుగా తవ్వడాన్ని డీప్ కట్ అంటారు. ఇక్కడ డీప్కట్లను దాదాపు 60 నుంచి 70 అడుగుల లోతుగా కాల్వ తవ్వారు. సాగర్ కాల్వకు నీటి సరఫరా నిలిపివేసినా సరే ఆయా డీప్కట్లలో ఐదారు అడుగుల లోతులో నీరు నిల్వ ఉండడం విశేషం. ప్రస్తుత వేసవి కావడంతో ఈ నీరు పశువుల దాహార్తిని తీరుస్తుండడంతోపాటు చుట్టుపక్కల గ్రామాల విద్యార్థులు ఈత నేర్చుకుంటున్నారు. దీనికితోడు ప్రతి సీజన్ ఆరంభంలోనూ సాగర్ నీటిని వదలకున్నా అనేక మంది రైతులు ఈ నీటితోనే వరినార్లు పోసుకుంటున్నారు.


