తుంగతుర్తి : మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన విప్లవ వీరుడు మారోజు వీరన్న అని బహుజన కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.పర్వతాలు, రాష్ట్ర నాయకుడు గాజుల శ్రీనివాస్ అన్నారు. కుల, వర్గ నిర్మూలన పోరాట సిద్ధాంతకర్త, మలిదశ తెలంగాణ ఉద్యమ నిర్మాత మారోజు వీరన్న 27వ వర్ధంతి సభను శనివారం మండలంలోని కొత్తగూడెం గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వీరన్న విగ్రహానికి వారు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. వీరన్న బహుజన రాజ్యాధికారం కోసం పోరాడిన యోధుడని, అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి కృషి చేశారని గుర్తు చేశారు. ప్రస్తుత సమాజంలో విద్యా వికాసం జరగాల్సిన చోట దుర్మార్గపు విధానాలు రాజ్యమేలుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జనగణనలో కులగణన చేపట్టాలని అన్ని పార్టీలు ముక్తకంఠంతో కోరుతున్నా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుందని అన్నారు. మహిళల అభ్యున్నతి పట్ల బీజేపీకి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో శ్రీహరియాదవ్, బత్తుల వెంకన్న, మారోజు చైతన్య, మారోజు దిశ, నారబోయిన వెంకట్, కుంట్ల ధర్మార్జున్, రాంబాబు, కొండ లింగయ్య, చెట్టుపల్లి కాశీరాం, వెంకటరెడ్డి, సురేందర్, వీరస్వామి, వెంకటరమణ, మట్టపల్లి లింగయ్య తదితరులు పాల్గొన్నారు.


