నేరేడుచర్ల : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మూసీ నది ప్రక్షాళన పనులు కేవలం హైదరాబాద్ పట్టణానికే పరిమితం కాకుండా పూర్తిస్థాయిలో చేపట్టాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి అన్నారు. గురువారం నేరేడుచర్లలోని అరిబండి భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నల్లగొండ జిల్లాలోని వాడపల్లి కృష్ణానదికి త్రివేణి సంగమం అని అక్కడి వరకు ప్రక్షాళన చేపట్టాలని పేర్కొన్నారు. మూసీ ప్రాజెక్టులో ఇసుక మేటలు, మట్టితో పూడిక పేరుకుపోయిందని, దీనిని తొలగించి నీటి నిలువలు పెంచే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. దెబ్బతిన షట్టర్లను మరమ్మతులు చేయించాలన్నారు. కాలువకు ఇరువైపులా సీసీ లైనింగ్ పనులు చేపట్టాలని, చివరి భూముల రైతులకు నీరు అందించాలన్నారు. సమావేశంలో జిల్లా కార్యవర్గ సభ్యులు పారేపల్లి శేఖర్రావు, వీరేపల్లి వెంకటేశ్వర్లు, పల్లా వెంకట్రెడ్డి, అనంత్ ప్రకాశ్, నగేష్, రామ్మూర్తి, హుస్సేన్, సైదులు, వడిత్యనాయక్, వెంకటేశ్వర్లు తదితరులున్నారు.


