బడ్జెట్లో పంచాయతీరాజ్ శాఖకు ప్రభుత్వం అధిక నిధులు కేటాయించింది. ఈ నిధులతో గ్రామీణ ప్రాంతాల్లో బీటీ రోడ్లు రూపుదిద్దుకోనున్నాయి. జిల్లాలోని చాలా ప్రాంతాల్లో గ్రామాలను కలుపుతూ ఉండే లింక్ రహదారులు ఇంకా అస్తవ్యస్తంగానే ఉన్నాయి. ఈ బడ్జెట్లో కేటాయించినట్లుగా నిధులు విడుదల చేస్తే ఈ రహదారులన్నీ బాగుపడి రవాణా వ్యవస్థ మెరుగుపడనుంది.
నిరుద్యోగ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రాయితీలపై రుణా లను మంజూరు చేసేందుకు గతేడాది ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రవేశపెట్టింది. అర్హులైన నిరుద్యోగుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించగా.. ఆయా వర్గాల నుంచి దాదాపు 22వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. అయితే నిధులను మాత్రం ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో దరఖాస్తులకు మోక్షం కలగలేదు. ఈ బడ్జెట్లో సుమారుగా రూ.6వేల కోట్లను ప్రభుత్వం ప్రతిపాదించడంతో నిరుద్యోగ యువతలో ఆశలు చిగురించాయి.


