చేయూత పెన్షన్ పథకం కింద.. సాధారణ పెన్షన్లు రూ.2వేలు, దివ్యాంగులకు రూ.4వేల
చొప్పున అందిస్తున్నారు. చివరిసారిగా 2022లో కొత్త పెన్షన్లను అప్పటి ప్రభుత్వం మంజూరు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లుగా పెన్షన్ల మంజూరు, పెన్షన్ల పెంపు లేకుండా పోయింది. ఈ బడ్జెట్లో పెన్షన్ల పెంపు రూ.500 వరకు ఉంటుందని ప్రచారం జరిగినా ప్రభుత్వం ఈ విషయంలో నిర్ణయం తీసుకోలేదు. కానీ కొత్త పెన్షన్లను మంజూరు చేయాలని నిర్ణయించగా.. జిల్లాలో సుమారుగా 15వేలకు మందికి లబ్ధి చేకూరనుంది.
ఇందిరమ్మ ఇళ్లు వేగవంతం
జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంత కానుంది. ఈ బడ్జెట్లో గృహ నిర్మాణ శాఖకు రూ.7,430 కోట్లు కేటాయించింది. ఇందులో ఇందిరమ్మ ఇళ్ల కోసమే దాదాపు రూ.5500 కోట్లు ఉన్నాయి. ఈ క్రమంలో జిల్లాలో వివిధ దశల్లో ఉన్న 5,400 ఇళ్లకు బిల్లుల చెల్లింపు జరగనుంది. నిర్మాణాలు వేగంగా పూర్తి కానున్నాయి. ఇక రెండోవిడత ఇందిరమ్మ ఇళ్ల ప్రస్తావన లేకపోవడంతో ఈ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారులు నిరాశ చెందారు.


