శంభులింగేశ్వరాలయంలో పూర్ణాహుతి
మేళ్లచెరువు : మండల కేంద్రంలోని ఇష్టకామేశ్వరీ సమేత స్వయంభూ శంభులింగేశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఐదవ రోజైన గురువారం ఆలయ అర్చకులు పూర్ణాహుతి కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. తొలుత ఉదయం సుప్రభాతం, అభిషేకాలు, అమ్మవారికి కుంకుమార్చన అనంతరం పూర్ణాహుతి నిర్వహించారు. అదేవిధంగా వసంతోత్సవం, త్రిశూల తీర్థం ఆశీర్వచనాలు, మహానివేదన, మంగళనీరాజన మంత్రపుష్పం, తీర్థప్రసాద వినియోగం వంటి కార్యక్రమాలు చేపట్టారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ పెండ్లి లచ్చయ్య, ఈఓ శంభిరెడ్డి, అర్చకులు కొంకపాక రాధాకృష్ణమూర్తిశర్మ, విష్ణువర్దన్శర్మ, ధనంజయశర్మ తదితరులు పాల్గొన్నారు.


